Breaking News

షాక్ ఇచ్చిన రైల్వే: ప్లాట్‌ఫామ్ టిక్కెట్ రూ.30కి పెంపు.. లోకల్ రైళ్ల ఛార్జీలు కూడా!


ప్లాట్‌ఫామ్ టికెట్ ధరల విషయంలో ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రూ.10గా ఉన్న ధరను ఏకంగా రూ.30కు పెంచింది. ఒకేసారి రూ.20 ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌పై పెంచడం గమనార్హం. పెంచిన ధ‌ర‌ల‌ను తక్షణమే అమ‌లు చేయాలని అన్ని జోన్ల‌కూ ఆదేశాలు జారీచేసింది. మ‌రోవైపు, లోక‌ల్ ట్రెయిన్ టికెట్ల‌ను కూడా భారీగా పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. లోక‌ల్ రైళ్ల‌లో క‌నీస ఛార్జీ రూ.30గా నిర్ణ‌యించింది. దేశంలో మరోసారి క‌రోనా వైరస్ మహమ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో అన‌వ‌స‌ర ప్ర‌యాణాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఛార్జీల‌ను పెంచుతున్న‌ట్లు రైల్వే శాఖ పేర్కొంది. అయితే, ఈ పెంపు తాత్కాలికమేనని.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా లోక‌ల్ రైళ్లు, ప్లాట్‌ఫాం‌పై రద్దీని నియంత్రించడం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పింది. ‘ప్రయాణికుల భద్రత దృష్ట్యా అధిక రద్దీని నియంత్రించడానికి రైల్వే యంత్రాంగం తాత్కాలికంగా టిక్కెట్ ధరలను పెంచింది’అని రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన తర్వాత రైల్వే స్టేషన్లలో సందర్శకుల సంఖ్యను నిరోధించడానికి ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరలను సమయానుకూలంగా పెంచాం.. క్షేత్రస్థాయి అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల ఛార్జీలను మార్చగల అధికారం డీఆర్ఎంలకు అప్పగించాం’ అని తెలిపింది. గత నెలలో తక్కువ దూరం ప్రయాణించే రైళ్ల టిక్కెట్ ధరలను రైల్వే శాఖ స్వల్పంగా పెంచిన విషయం తెలిసిందే. అనవసరపు ప్రయాణాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా, సెంట్రల్ రైల్వే సైతం ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరను రూ.10 నుంచి ఏకంగా రూ.50కు పెంచింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ ధరలను మార్చి 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జూన్ 15 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు నగరాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


By March 05, 2021 at 01:48PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/hike-in-platform-ticket-rates-temporary-measure-indian-railways/articleshow/81345937.cms

No comments