Breaking News

ఈ ఏడాది బడ్జెట్ భిన్నం.. తొలిసారిగా డిజిటల్ రూపంలో!


కేంద్ర బడ్జెట్‌కు అంతా సిద్ధమయ్యింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా మూడోసారి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం మొదలవుతుంది. అంతకు ముందు కేంద్ర క్యాబినెట్ 10.15 గంటలకు సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ఇదిలా ఉండగా కోవిడ్-19 నేపథ్యంలో తొలిసారి పేపర్‌లెస్‌ బడ్జెట్‌‌ను ప్రవేశపెడుతున్నారు. లోక్‌సభలో ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసి, బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. గంట విరామం అనంతరం రాజ్యసభ సమావేశమవుతుంది. అయితే, రాజ్యసభలో ఆర్దిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటన చేస్తారు. తర్వాత పెద్దల సభ కూడా వాయిదా పడుతుంది. కాగా, ఈసారి బడ్జెట్‌పై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. గత బడ్జెట్స్ కన్నా ఈసారి భిన్నంగా ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ బడ్జెట్‌తో వస్తుండటం ఇదే తొలిసారి. కరోనా వైరస్ ఇందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. బడ్జెట్‌ను లోక్‌సభ టీవీ, పీఐబీ, దూరదర్శన్, రాజ్యసభ టీవీ వంటి పలు మాధ్యమాల్లో వీక్షించవచ్చు. వీటి యూట్యూబ్ ఛానల్స్, ట్విటర్ అకౌంట్ల ద్వారా కూడా బడ్జెట్ చూడవచ్చు. బడ్జెట్ కన్నా ముందు ఆవిష్కరించే ఎకనమిక్ సర్వే 2020-21ను జనవరి 29న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇక, రెండు విడతలుగా జరిగే సమావేశాల్లో తొలి విడత శుక్రవారం నుంచి ఫిబ్రవరి 15 వరకు, రెండో దశ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8వరకు జరగనున్నాయి.


By February 01, 2021 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/finance-minster-nirmala-sitharaman-to-present-first-digital-only-budget-today/articleshow/80622178.cms

No comments