Breaking News

ఆ ఐదు రాష్ట్రాల వారికి కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి.. ఢిల్లీ సంచలన నిర్ణయం!


దేశంలో మరోసారి కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్‌లో మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలనే నిబంధన తీసుకొచ్చింది. శుక్రవారం (ఫిబ్రవరి 26) నుంచి ఈ ఉత్తర్వులు అమలవుతాయని స్పష్టం చేసింది. ఆ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తే తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిని తెలిపింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 15 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. బుధవారం సాయంత్రంలోగా ఈ ఉత్తర్వులను వెలువరించనున్నారు. మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్‌‌లో గత వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు 86 శాతం మేర పెరగడంతోనే ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో రెండు రకాల కొత్త కరోనా వేరియంట్లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. N440K, E484K అనే రెండు రకాల వేరియంట్లను గుర్తించినట్లు మంగళవారం తెలిపింది. ఈ కొత్త వైరస్ వేరియంట్లను మహారాష్ట్రలో గుర్తించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మహారాష్ట్రతో పాటు కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇదే రకం వైరస్ వేరియంట్లను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. దేశంలో గుర్తించిన కొత్త రకం వేరియంట్స్, వాటి ప్రమాద తీవ్రత గురించి అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో 187 యూకే రకం కరోనా వైరస్ కేసులు, 6 సౌతాఫ్రికా స్ట్రెయిన్ కేసులతో పాటు బ్రెజిల్ రకానికి చెందిన ఒక కేసును గుర్తించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు


By February 24, 2021 at 10:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-to-make-negative-covid-report-must-for-arrivals-from-5-states-sources/articleshow/81184541.cms

No comments