Breaking News

మాయన్మార్‌: సైనిక తిరుగుబాటు, నిర్బంధలో సూకీ.. ఏడాది పాటు ఎమర్జెన్సీ


మరోసారి మాయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన నోబెల్ శాంతి బహుమతి విజేత సహా ఇతర సీనియర్ నేతలను సైన్యం నిర్బంధించింది. ఈ మేరకు నేషల్ లీగ్ డెమొక్రాటిక్ పార్టీ అధికార ప్రతినిధి రాయిటర్స్‌కు వెల్లడించారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సైనిక పాలన అనంతరం మయన్మార్‌లో తొలిసారిగా 2015లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నేషనల్‌ లీగ్‌ డెమొక్రాటిక్‌ పార్టీ (NLD)కి చెందిన సూకీ విజయం సాధించి అధికారం చేపట్టారు. తిరిగి 2020 ఎన్నికల్లోనూ ఆమె విజయం సాధించారు. అయితే, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతోనే ఆంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకున్నట్టు సైన్యం ప్రకటించింది. మిలటరీ చీఫ్ మిన్ ఆంగ్ హైంగ్‌కు అధికారం చేపట్టి, ఏడాది పాటు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, దీనిపై స్పందించడానికి మిలటరీ అధికార ప్రతినిధి అందుబాటులోకి రాలేదు. రాజధాని నాయిపిడా, యాంగోన్ ప్రధాన వాణిజ్య కేంద్రానికి మొబైల్ సేవలు నిలిపివేశారు. నవంబర్‌‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్ఎల్డి భారీ విజయం సాధించిన తరువాత పార్లమెంటు తొలిసారి సమావేశం కావడానికి కొద్ది గంటలు ముందే సైన్యం అధికారం హస్తగతం చేసుకోవడం గమనార్హం. మొబైల్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసి, సూకీ, మాయన్మార్ అధ్యక్షుడు విన్ మైంట్, ఇతర అధికార పార్టీ నేతలను సోమవారం తెల్లవారుజామున నిర్బంధంలోకి తీసుకున్నారు. నవంబర్‌ 8న మయన్మార్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఎగువ, దిగువ సభల్లో కలిసి ఎన్‌ఎల్‌డీ 346 సీట్లు సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 322 సీట్లు మాత్రమే అవసరం కావడంతో ఎన్‌ఎల్‌డీ ప్రభుత్వ ఏర్పాటయ్యింది. సైన్యం మద్దతు ఉన్న యూఎస్‌డీపీ పార్టీకి 25 సీట్లు సాధించింది.


By February 01, 2021 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/myanmar-leader-aung-san-suu-kyi-and-other-senior-leaders-detained/articleshow/80623061.cms

No comments