Breaking News

హిందూ మహిళ ఆస్తులకు పుట్టింటి వారూ వారసులే.. సుప్రీం సంచలన తీర్పు


మహిళల ఆస్తిహక్కు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మరో కీలక తీర్పును వెలువరించింది. భర్తవైపు నుంచి వచ్చిన ఆస్తులను హిందూ మహిళలు తమ పుట్టింటివారికి ఇవ్వొచ్చని తీర్పు వెల్లడించింది. వారసత్వ చట్టంలోని సెక్షన్ 15.1డీ ప్రకారం.. మహిళ పుట్టింటి సభ్యులు కూడా వారసులవుతారని స్పష్టం చేసింది. మహిళల ఆస్తులు పుట్టింటి తరఫు వారసులకు కూడా సంక్రమిస్తాయని పేర్కొంది. జగ్నో అనే మహిళ ఆస్తి కేసులో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే జగ్నో భర్త షేర్‌ సింగ్‌ 1953లోనే చనిపోగా.. వీరికి సంతానం లేదు. భర్త మరణం తర్వాత వారసత్వంగా వచ్చిన భూములు జగ్నోకు సంక్రమించాయి. తనకు పిల్లలు లేకపోవడంతో తన ఆస్తులను తమ్ముడి కొడుకులకు అప్పగించడానికి ఆమె ఒప్పందం చేసుకుంది. అయితే, దీనికి జగ్నో భర్త సోదరుడి కుమారుడు అభ్యంతరం చెబుతూ 1991లో సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఆ ఆస్తులకు తామే వారసులమని, వారసత్వ హక్కు తమకే ఉంటుందని పేర్కొన్నారు. మహిళ పుట్టింటివారికి ఆస్తులను పొందే హక్కు లేదని వాదించారు. సివిల్ కోర్టులో జగ్నోకు అనుకూలం తీర్పు రావడంతో వారు హైకోర్టు‌లో పిటిషన్ వేశారు. అక్కడా చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం.. ‘హిందూ మహిళ తరఫు వారసులను బయటివారుగా భావించకూడదు’ అని స్పష్టం చేసింది. ‘కుటుంబం’ అనే పదాన్ని విస్తృత అర్థంలో చూడాలని సూచించింది. అంతేకాదు, ఇప్పటికే హక్కులను సృష్టించిన ఆస్తిపై ఏదైనా సిఫారసు డిక్రీ ఉంటే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 17.2 కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు జగ్నో మరిది వారసులు దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.


By February 26, 2021 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/hindu-woman-can-give-her-property-to-fathers-family-says-supreme-court/articleshow/81221530.cms

No comments