Breaking News

రిపబ్లిక్ డే హింస కేసు.. ఎట్టకేలకు నటుడు దీప్ సిద్ధూ అరెస్ట్


గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన కిసాన్ ర్యాలీ హింసాత్మకంగా మారడంలో కీలక పాత్రపోషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 15 రోజులుగా పరారీలో ఉన్న దీప్ సిద్ధూనూ ఎట్టకేలకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటన కేసులో ప్రధాన నిందితుడైన దీప్ సిద్ధూ పోలీసులకు చిక్కాడు. ఎర్ర కోట వద్ద జెండాలు ఎగురవేసిన దీప్ సిద్దూ, జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జంత్ సింగ్‌‌ల గురించి సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు గతంలో ప్రకటించారు. ఎర్రకోట ఘటనపై ఢిల్లీ పోలీసులు గతంలో దీప్ సిద్దూతోపాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న జజ్బీర్ సింగ్, బూటాసింగ్, సుఖదేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్‌ల ఆచూకీ చెప్పినవారికి సైతం నగదు బహుమతులు ఇస్తామని ఢిల్లీ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం జాయింట్ కమిషనర్ బీకే సింగ్ చెప్పారు. ఈ కేసును బీకే సింగ్ నేతృత్వంలో డీసీపీలు జాయ్ టుర్కీ, భేషంసింగ్, మోనికా భరద్వాజ్‌లు దర్యాప్తు చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన ఘటనపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రంతోపాటు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అజ్ఞాతంలో ఉన్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్‌ చేస్తోంది అతడి గర్ల్‌ఫ్రెండ్ అని ఢిల్లీ పోలీసులు అంతకు ముందు గుర్తించారు. విదేశాల్లో ఉన్న ఆమె సిద్ధూ ఫేస్‌బుక్‌ ఖాతాను నిర్వహిస్తోందని గుర్తించామని పోలీసు వర్గాలు శనివారం (ఫిబ్రవరి 6) వెల్లడించాయి. విదేశాల్లో ఉన్న ఆమెకు సిద్ధూ వీడియోలు పంపితే.. ఆమె వాటిని అప్‌లోడ్ చేస్తుందని తెలిపాయి.


By February 09, 2021 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/punjab-actor-activist-deep-sidhu-arrested-in-connection-with-r-day-violence/articleshow/80760541.cms

No comments