Breaking News

నీతి ఆయోగ్ సూచనతోనే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు


విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎన్నో ఏళ్లు పోరాటలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ఇప్పుడు ప్రయివేట్ పరం చేయడం దారుణమని మండిపడుతున్నాయి. నష్టాలు సాకుతో స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేట్ సంస్థలకు దారాధత్తం చేయడానికి కేంద్రం సిద్ధమయ్యిందని దుయ్యబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై స్పందించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నీతీ ఆయోగ్ సిఫారసుల మేరకే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే విక్రయించాలని నీతీ ఆయోగ్ సూచించిందని, ఆ ప్రకారమే తాము ముందుకు వెళతామని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచన తమకు లేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అలాగే, బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులపైనా ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు అన్యాయం జరగలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను జాతీయ దృక్పథంతో చూడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోలవరం నిధులపై తమను మూడుసార్లు కలిశారని తెలిపారు. ఒప్పందం ప్రకారమే పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తున్నామని అనురాగ్ ఠాకూర్ వివరించారు.


By February 06, 2021 at 03:35PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-minister-anurag-thakur-responded-about-visakha-steel-plant-privatisation/articleshow/80722330.cms

No comments