Breaking News

పాతికేళ్లుగా మహిళ గొంతులో విజిల్.. అవాక్కయిన వైద్యులు!


ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే చిన్నప్పుడు విజిల్‌ మింగేశాడు రా అని వెటకారంగా అంటాం. కానీ, ఓ మహిళ ఎప్పుడైనా బిగ్గరగా మాట్లాడిందో లేదో తెలియదు కానీ, ఆమె 25 ఏళ్ల కిందట విజిల్‌ మాత్రం మింగేసింది. కొన్నేళ్లుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఆ మహిళ వైద్యులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు, గొంతులో ఏదో వస్తువు ఉందని భావించాడు. బ్రోంకోస్కోపీ ద్వారా గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్లే మార్గంలో ఓ చిన్న విజిల్‌ ఉందని గుర్తించారు. దీంతో వెంటనే ఆ మహిళకు ఆపరేషన్‌ చేసి విజిల్‌ను బయటకు తీశాడు. ఈ ఘటన కేరళలోని కన్నూర్‌ జిల్లా మట్టనూర్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ మహిళకు 40 ఏళ్లు కాగా.. ఆమె 15 ఏళ్ల వయసులో ఆటాడుకుంటూ పొరపాటున ఓ విజిల్‌ను మింగేసింది. దీంతో కంగారుపడి ఎక్కువగా నీళ్లు తాగేసింది. అక్కడితో ఆ సమస్య తీరిపోయిందని భావించింది. కానీ, ఆ విజిల్‌ మాత్రం గొంతు, ఊపిరితిత్తుల మధ్య ఇరుక్కుపోయింది. దీని ప్రభావం వల్ల మొదలైన దగ్గుతో దాదాపు రెండు దశాబ్దాలు బాధపడింది. దగ్గు వేధించడంతో స్థానికంగా ఉన్న ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణుడిని సంప్రదించింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు.. గాలిగొట్టం లోపల ఏదో వస్తువు ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే కన్నూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశాడు. మెడికల్ కాలేజీ వైద్యులు రాజీవ్ రామ్, పద్మనాభన్ బృందం శస్త్రచికిత్స నిర్వహించి గాలిగొట్టంలో ఇరుక్కున్న విజిల్‌ను బయటకు తీశారు. తొలుత తనకు ఆస్త్మా ఉందని మహిళ భయపడిందని వైద్యులు అన్నారు. విజిల్‌ను బయటకు తీసిన తర్వాత ఆమెకు దగ్గు, ఊపిరి తీసుకోవడంలో సమస్యల నుంచి ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.


By February 19, 2021 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/doctors-in-kerala-remove-whistle-stuck-in-womans-respiratory-system-for-25-years/articleshow/81104270.cms

No comments