Breaking News

మూడేళ్ల కిందట ప్రేమ పెళ్లి.. విడాకులు కోరిందని భార్యను హత్యచేసిన డాక్టర్


ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య విడాకులు కోరడంతో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వైద్యుడు. కత్తితో పొడిచి, అనంతరం ఆమెను కారుతో తొక్కించి కిరాతకంగా వ్యవహరించాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరుకు చెందిన గోకుల్‌కుమార్‌ (40) కాటాన్‌ కొళత్తూరులోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మరో ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న సమీప బంధువు కీర్తన (35)ను ప్రేమించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఇల్లరికం వచ్చి గోకుల్ కుమార్.. చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని కృష్ణప్రియనగర్‌లో కీర్తన తల్లి కుమారి, తండ్రి మురహరితో కలిసున్నాడు. అయితే, ఇటీవల భార్యభర్తల మధ్య అభిప్రాయబేదాలు తలెత్తడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కీర్తన ఇంటికి వెళ్లిన గోకుల్‌ ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీయగా.. గోకుల్‌లో ఆవేశం కట్టలు తెంచుకుంది. దీంతో పక్కనే ఉన్న కత్తి తీసుకుని అడ్డొచ్చిన మామ మురహరిపై దాడి చేశాడు. అనంతరం కీర్తనను విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో కీర్తన వీధిలోకి పరుగులు తీసింది. దీంతో ఆమెను కారులో వెంబడించి తొక్కించి హత్యచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన కీర్తనను తల్లిదండ్రులు, ఇరుగు పొరుగువారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కీర్తన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రస్తుతం కీర్తన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అటు, నిందితుడు గోకుల్ కారులో తప్పించుకెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. గోకుల్ కోసం పోలీసులు వెంబడించడంతో మధురాంతకం టోల్‌గేటు వద్ద అతడి వాహనం బోల్తాపడడంతో గాయపడ్డాడు. దీంతో అతడిని చెంగల్పట్టు ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అనంతరం అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.


By February 21, 2021 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/doctor-slits-wifes-throat-runs-her-over-in-tamil-nadu/articleshow/81134135.cms

No comments