హెలికాప్టర్లో మండపానికి వరుడు.. పెళ్లి ముగిసిన తర్వాత వధువుతో సహా
ఒకప్పటిలా గుర్రాలు, కార్లలో ఊరేగింపు రావడానికి పెళ్లికొడుకులు ఇష్టపడటం లేదు. నలుగురూ తమ గురించి చెప్పుకోవాలని, తమకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. వినూత్నంగా హెలికాప్టర్లో పెళ్లి మండపానికి వచ్చి, వధువును తీసుకెళుతున్నారు. ఆకాశంలో ఎగురుతూ వస్తే.. ఆ మజానే వేరంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. తాజాగా, ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాలోనూ వరుడు హెలికాప్టర్లో పెళ్లి మండపానికి వచ్చి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఎటావా జిల్లా అలీగంజ్కు చెందిన చౌదురి రామేశ్వర్ సింగ్ యాదవ్ కుమారుడు ఆర్యన్కు వివాహం జరిగింది. మెయిన్పురి జిల్లా హన్స్నగర్కు చెందిన జింతేదర్ సింగ్ యాదవ్ కుమార్తె నేహాను ఆర్యన్ పెళ్లాడాడు. ఎటావా నుంచి హన్స్నగర్లోని వివాహ వేదికకు ఆర్యన్ హెలికాప్టర్లో వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆర్యన్ తండ్రి వ్యాపారవేత్త కాగా, నేహా తండ్రి డిప్యూటీ విద్యాశాఖ అధికారి. దీంతో తన కుమారుడి వివాహం కోసం తండ్రి హెలికాప్టర్ తెప్పించాడు. దీంతో ఆర్యన్ హెలికాప్టర్లో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. వధువు కుటుంబికులు వరుడికి సాదర స్వాగతం పలికారు. వివాహ తంతు ముగిసిన తర్వాత వధువు నేహాతో సహా హెలికాప్టర్లో పయనమయ్యాడు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జనం ఎగబడ్డారు. కళ్యాణ మండపం సమీపంలోని క్రిస్టియన్ గ్రౌండ్స్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం 1.00 గంటకు హెలికాప్టర్ బయలుదేరాల్సి ఉన్నా భారీగా జనం రావడంతో ఆలస్యమయ్యింది. వరుడు తండ్రి రామేశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. కుమారుడి కోరిక తీర్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
By February 18, 2021 at 11:55AM
No comments