Breaking News

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ముగ్గురు ముష్కరులు హతం.. అమరుడైన ఓ అధికారి


జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భదత్రా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. షోపియాన్ జిల్లా బడీగామ్ వద్ద ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. సైన్యం ఎదురుకాల్పుల్లో హతమైన ఉగ్రవాదులు లష్కరే తొయిబాకు చెందినవారని కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బడీగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో గురువారం అర్ధరాత్రి తర్వాత అక్కడకు చేరుకున్న సైన్యం తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమయి ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమ్యయారు. ఆ ప్రాంతంలో ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, బుద్గామ్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ పోలీస్ అధికారి అమరుడు కాగా, మరో సైనికుడు గాయపడ్డాడు. బీర్వాహ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎస్పీఓ మొహముద్ అల్తాఫ్ ప్రాణాలు కోల్పోగా.. సైనికుడు మంజూర్ అహ్మద్ తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. కాగా, కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్ కొత్త వ్యూహాలను ఎంచుకుంటోంది. పాక్ భూభాగం నుంచి కశ్మీర్‌లోకి సొరంగాలను తవ్వి వాటి ద్వారా ముష్కరులను చేరవేసే ప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దుల్లో ఇటీవల కాలంలో అటువంటి సొరంగాలను భారత్ సైన్యం గుర్తించిన విషయం తెలిసిందే. అలాగే, ఉగ్రవాదుల డంప్‌లను కూడా స్వాధీనం చేసుకుంది.


By February 19, 2021 at 09:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-terrorists-killed-in-encounter-in-shopian-at-jammu-and-kashmir/articleshow/81102821.cms

No comments