Breaking News

హరియాణా: కాల్పులకు తెగబడ్డ రెజ్లింగ్ కోచ్.. ఐదుగురు రెజ్లర్లు మృతి


శిక్షణా కేంద్రంలో కోచ్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి ఐదుగుర్ని పొట్టనబెట్టుకున్నాడు. ఈ దుర్ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌లో శుక్రావారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోచ్ సుఖ్వీందర్ సింగ్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతిచెందినవారిలో ముగ్గురు కోచ్‌లు, ఇద్దరు మహిళా రెజర్లు ఉన్నారు. రోహ్‌తక్‌లోని ఓ ప్రయివేట్ కాలేజీలోని శిక్షణా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వారిలో రెజ్లింగ్‌ కోచ్‌‌లు కూడా ఉన్నారని పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. కొందరు రెజ్లింగ్‌ కోచ్‌ల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటనలో ముగ్గురు చనిపోయినట్టు రోహ్‌తక్ ఎస్పీ రాహుల్ శర్మ ధ్రువీకరించగా.. మరో అధికారి మాత్రం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. ఫోరెన్సిక్ నిపుణులు, విచారణ సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారని రోహ్‌తక్ రేంజ్ ఐజీ సందీప్ ఖిరావర్ వివరించారు. బరోడాకు చెందిన సుఖ్వీందర్ సింగ్ రెజ్లింగ్ కోచ్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శిక్షణా కేంద్రంలో మనోజ్, ఆయన భార్య సాక్షి, కుమారుడు సర్తాజ్, మరో కోచ్ సతీశ్, ప్రదీప్ ఫౌజీ, పూజ సహా మరో వ్యక్తిపై సుఖ్వీందర్ కాల్పులు జరిపాడు. వీరిలో ఐదుగురు చనిపోగా.. మనోజ్కుమారుడు సర్తాజ్, అమర్జీత్ ఇద్దరూ గాయపడ్డారు. రెజ్లర్ల మధ్య ఉన్న విభేదాలే కాల్పులకు కారణమని, గాయపడినవారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే, కాల్పులకు దారితీసిన కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉందని అన్నారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. మృతదేహాలను శవపరీక్ష కోసం పంపినట్టు తెలియజేశారు.


By February 13, 2021 at 12:24PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/five-killed-in-firing-at-wrestling-traing-camp-in-rohtak-in-haryana/articleshow/80893526.cms

No comments