Breaking News

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి


ఉత్తర్ప్రదేశ్ కనౌజ్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై తలగ్రామ్ వద్ద నిలిచి ఉన్న ట్రక్కును వెనుక నుంచి వస్తున్న ఓ కారు ఢీ కొట్టింది. దీంతో కారులోని ఆరుగురు దుర్మరణం చెందారు. పొగ మంచు కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో రహదారి కనిపించకపోవడంతో ముందున్న ట్రక్కును కారు డ్రైవర్ ఢీకొట్టాడు. నిలిచి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో కారులోని వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్నవారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. లక్నో నుంచి మెహందీపూర్‌లో బాలాజీ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం. ఘటనపై బాధితుల కుటుంబీకులకు సమాచారం అందించిన పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. లక్నోలోని కకోరికి చెందిన జ్ఞానేంద్ర యాదవ్ కుటుంబంగా గుర్తించారు. మృతులు జ్ఞానేంద్ర యాదవ్, సోను యాదవ్, ప్రమోద్ యాదవ్, సతేంద్ర యాదవ్, మోహిత్, సూరజ్‌లుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనం లోపల చిక్కుకున్నవారిని అతికష్టంతో బయటకు తీశారు. తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.


By February 13, 2021 at 11:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/six-people-of-same-family-died-due-to-car-collided-with-standing-truck-in-uttar-pradesh/articleshow/80893188.cms

No comments