ఫైజర్ షాకింగ్ నిర్ణయం.. భారత్లో టీకా వినియోగానికి చేసిన దరఖాస్తు వెనక్కు!

దేశంలో తమ టీకా అత్యవసర వినియోగానికి చేసుకున్న ధరఖాస్తును వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్టు అమెరికా ఫార్మ దిగ్గజం ఫైజర్ శుక్రవారం ప్రకటించారు. భారత్లో టీకా అనుమతి కోసం దరఖాస్తు చేసిన తొలి సంస్థ ఫైజర్ కావడం గమనార్హం. యూకే, బహ్రెయిన్లు ఆమోదం తెలిపిన తర్వాత డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు ఫైజర్ దరఖాస్తు చేసింది. ‘కోవిడ్-19 టీకా అత్యవసర వినియోగం కింద అనుమతి కోసం దరఖాస్తు చేసిన ఫైజర్.. ఫిబ్రవరి 3న డీసీజీఐ నిపుణుల కమిటీ ముందు హాజరయ్యింది... సమావేశంలో చర్చలు, రెగ్యులేటర్కు అవసరమైన అదనపు సమాచారం గురించి మా అవగాహన ఆధారంగా ఈ సమయంలో దరఖాస్తును ఉపసంహరించుకోవాలని కంపెనీ నిర్ణయించింది’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు, రెగ్యులేటరీ అడిగిన అదనపు సమాచారాన్ని జోడించి భవిష్యత్తులో టీకా అనుమతి కోసం తిరిగి దరఖాస్తు చేస్తామని పేర్కొన్నారు. ‘ఫైజర్ తన వ్యాక్సిన్ను భారత్లో అత్యవసర వినియోగం కింద అందుబాటులో ఉంచడానికి, ఇందుకు అవసరమైన మార్గాన్ని అనుసరించడానికి కట్టుబడి ఉంది.. ఇది భవిష్యత్తులో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతిస్తుంది’ అని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా అత్యవసర వినియోగం కింద అనుమతి కోరుతూ డిసెంబరు 2020లో డీసీజీఐకి దరఖాస్తు చేసింది. న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్- 2019 ప్రకారం ప్రత్యేక నిబంధనలకు అనుగుణంగా భారతీయులపై క్లినికల్ ట్రయల్స్తో సంబంధం లేకుండా టీకాకు అనుమతి కోరింది.
By February 05, 2021 at 01:20PM
No comments