Breaking News

ముదురుతున్న వివాదం.. ట్విట్టర్ ఉన్నతాధికారుల అరెస్ట్‌కు సిద్ధమైన కేంద్రం!


సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై చర్యలకు కేంద్రం సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న ఉద్యమంపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ మొత్తం 1,158 ఖాతాలను నిలిపివేయాలని ట్విట్టర్‌ను కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, మొత్తం 1,178 ఖాతాలను నిలిపివేయాలని కేంద్ర ఐటీశాఖ ఆదేశించగా... సుమారు 500 ఖాతాలపైనే చర్యలు తీసుకున్నామంటూ ట్విటర్‌ వివరణ ఇచ్చింది. కానీ, భారత్‌లో మాత్రమే వాటిని స్తంభింపజేస్తున్నామని, ఇతర దేశాల్లో అవి యథావిధిగా పనిచేస్తాయని తేల్చిచెప్పింది. దీంతో ట్విట్టర్‌కూ, భారత ప్రభుత్వానికీ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లోని ట్విట్టర్ అగ్రశ్రేణి అధికారులు అరెస్ట్‌లను ఎదుర్కొనే పరిస్థితి నెలకుంది. రెచ్చగొట్టేలా ట్వీట్లు ముఖ్యంగా రైతుల ఉద్యమానికి సంబంధించి హ్యాష్‌ట్యాగ్ ఉన్నవారి ఖాతాలను నిలపివేయాలని ఐటీ చట్టంలోని సెక్షన్ 69 ఏ కింద ఇచ్చిన ఆదేశాలను పాటించడానికి ట్విట్టర్ నిరాకరించడంతో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది. కేంద్రం ఆదేశాలను పాక్షికంగా అనుసరించిన ట్విట్టర్.. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, జర్నలిస్టుల హ్యాండిళ్లను నిలిపివేయబోమని స్పష్టం చేసింది. అలా చేయడం భారత చట్టాల ప్రకారం వారి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకున్నట్టే అవుతుందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతోపాటు, తన బ్లాగులోనూ పోస్టు పెట్టింది. బుధవారం ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్స్ మోనిక్ మెచే, జిమ్ బేకర్‌లతో జరిగిన సమావేశంలో వివాదాస్పద హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించడం జర్నలిస్టిక్ స్వేచ్ఛ లేదా భావ ప్రకటనా స్వేచ్ఛ కాదని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీ స్పష్టం చేశారు. ఎందుకంటే బాధ్యతా రహితమైన సమాచారం పరిస్థితిని రెచ్చగొడుతుంది.. ఉద్రిక్తతలను ఉధృతం చేస్తుంది అని అన్నారు. క్యాపిటల్ హిల్, ఎర్రకోట హింసాత్మక ఘటనలను పరిష్కరించడంలో ట్విట్టర్ చర్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆదేశాలను ట్విట్టర్ పాటించాలి.. ఇది చర్చల విషయం కాదు. ఇది దేశ చట్టం, తాము చేపట్టిన చర్యలతో ఎవరికైనా సమస్య ఉంటే స్వేచ్ఛగా మీరు చట్టపరమైన సహాయం తీసుకోవచ్చు’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ట్విటర్‌కు పోటీగా భారత్‌లో ఆవిష్కరించిన ‘కూ’లో కేంద్ర ఐటీశాఖ స్పందించింది. ‘మా కార్యదర్శితో తమ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతినిధులు సమావేశమవుతారని ట్విటర్‌ కోరింది. ఇది జరగకముందే ఆ సంస్థ బ్లాగ్‌ పోస్టు పెట్టడం అసహజ చర్య. ప్రభుత్వం త్వరలోనే తన అభిప్రాయాన్ని పంచుకుంటుంది’ అని పేర్కొంది.


By February 11, 2021 at 10:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/top-twitter-executives-may-face-arrest-with-the-centre-making-it-clear-for-list-of-accounts/articleshow/80830299.cms

No comments