Breaking News

గల్వాన్‌లో చైనాపై దూసుకెళ్లిన భారత్ యువకుడు.. ఎవరా కుర్రాడు? నెట్టింట వైరల్


తూర్పు లడఖ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై పదో విడత చర్చలకు ముందు చైనా వ్యూహాత్మకంగా గల్వాన్ ఘర్షణలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. భారత్ దళాలే తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చి సీపీఎల్ఏ సైనికులపై దాడిచేశాయని ఆరోపించింది. అయితే, చైనా చేసిన ఆరోపణల్లో నిజం లేదు. వాస్తవానికి చైనా ఆక్రమణలను భారత సైన్యం ఖాళీ చేయించే ప్రయత్నం అది. ఈ వీడియోలో ఓ యువ సైనికుడు భారత బృందాన్ని లీడ్‌ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చైనా విడుదల చేసిన ఆ వీడియోలో కనిపిస్తున్న ఆ యువ సైనికుడు గురించి నెటిజన్లు ఆరాతీయగా.. అతడు మణిపూర్‌లోని సేనాపతి జిల్లాకు చెందిన సోయిబా మనినగ్బా రంగ్నామీగా తేలింది. 16 బిహార్ రెజిమెంట్‌లో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న సొయిబా.. 2018లో సైన్యంలో చేరాడు. ఈ విషయాన్ని మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్ ట్విటర్‌‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చైనా విడుదల చేసిన తర్వాత అతడి వివరాలపై భారత సైన్యం గోప్యత పాటించింది. కానీ, కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు కూడా ధ్రువీకరించడంతో వెలుగులోకి వచ్చింది. ‘మణిపూర్‌లోని సెనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్ సొయిబా మనినగ్బా రంగ్నామీ.. గాల్వాన్ లోయ వద్ద చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 16 బిహార్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించాడు’ అని కిరణ్ రిజుజు ట్వీట్ చేశారు. ‘గాల్వాన్ లోయ వద్ద చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 16 బిహార్ రెజిమెంట్‌కు మణిపూర్‌లోని సెనాపతి జిల్లాకు చెందిన కెప్టెన్ సొయిబా మనినగ్బా రంగ్నామీ నాయకత్వం వహించారు.. దేశం కోసం నిలబడి మీరు చూపిన శౌర్యానికి యావత్తు దేశం గర్వించింది’ అని మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు భారత్ సైన్యంలో చేరడానికి మణిపూర్‌కు చెందిన కొందరు యువకులు సిద్ధంగా ఉన్నారని వారి పేర్లను ట్విట్టర్‌లో సీఎం షేర్ చేశారు. ఇంఫాల్ సైనిక స్కూల్ నుంచి ఇండియన్ డిఫెన్స్‌ ఫోర్సెస్‌లో కొత్తగా చేరిన యువకుల పేర్లను వెల్లడించారు. తొలుత జూన్‌ 6న జరిగిన తొలి దశ చర్చల్లో గల్వాన్‌ లోయ వద్ద స్థావరాలను తొలగించడానికి చైనా అంగీకరించింది. జూన్ 15న 16 బిహార్‌ రెజిమెంట్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్ సంతోష్‌బాబు చైనా సైనికాధికారిని కలిసి తొలి దశ చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. ఆ సమయంలో చైనా దళాలు సంతోష్‌బాబుపై దాడి చేయడంతో భారత్ సైన్యం ఆవేశంతో రగిలిపోయింది. ఘాతక్‌ కమాండోలతో కలిసి భారీ సంఖ్యలో చైనా స్థావరం వద్దకు చేరుకొని ప్రతి దాడి చేసింది. ఊహించని విధంగా భారత సైన్యం దాడిచేయడంతో ఖంగుతింది.


By February 22, 2021 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kiren-rijiju-manipur-cm-hail-captain-rangnamei-for-bravery-at-galwan-valley-wins-accolades/articleshow/81145043.cms

No comments