రాజమండ్రిలో అడుగుపెట్టిన ‘ఆచార్య’: మెగాస్టార్కు ఘనస్వాగతం.. మన్యంలో షూటింగ్ షురూ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ నేటి (ఫిబ్రవరి 21) నుంచి తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఈ షూటింగ్లో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం మధురపూడి (రాజమండ్రి) ఎయిర్పోర్టులో దిగిన మెగాస్టార్ చిరంజీవికి ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. చిరంజీవి కారు ఎయిర్పోర్టు పరిసరాల నుంచి బయటికి రాగానే అభిమాను హంగామా మొదలైపోయింది. చిరంజీవి కారులో నుంచే నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. ఇక అభిమానులు చిరుపై పూల వర్షం కురిపించారు. ‘ఆచార్య.. ఆచార్య..’ అంటూ నినాదాలు చేసుకుంటూ చిరంజీవిని అభిమానులు ర్యాలీగా తీసుకెళ్లారు. రాజమండ్రి నగరం ‘ఆచార్య’ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయింది. ఇక కారులోనే చిరంజీవి మారేడుమిల్లి బయలుదేరు వెళ్లారు. నేటి నుంచి ఆయన ‘ఆచార్య’ ఔట్ డోర్ షూటింగ్లో పాల్గొననున్నారు. రామ్ చరణ్ నాలుగు రోజులుగా మారేడుమిల్లిలోనే ఉన్నారు. ఈ షెడ్యూల్లో ఆయన కూడా పాల్గొంటున్నారు. కథానుగుణంగా సహజసిద్ధంగా ఉండేందుకు కొన్ని సన్నివేశాలను దట్టమైన మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరించనున్నారు. ఈ ఔట్ డోర్ షూటింగ్ మార్చి మొదటి వారం వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు సమాచారం. చిరంజీవి సాహసోపేతమైన సన్నివేశాల్లో నటిస్తారట. ఈ ప్రాంతంలో ఇటీవలే అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్ జరిగింది. ఇప్పుడు ‘ఆచార్య’ షూటింగ్ కోసం రామ్ చరణ్, చిరంజీవి. దీంతో మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
By February 21, 2021 at 01:09PM
No comments