Breaking News

కాల్పులకు తెగబడ్డ యువకుడు.. ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి


ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతిచెందిన ఘటన అమెరికాలోని ఓక్లాహామాలో మంగళవారం చోటుచేసుకుంది. ఓక్లాహామాలోని ముస్కోగీ వద్ద జరిగిన ఈ ఘటనలో నిందితుడిని జార్రన్ డేజోజ్ ప్రిడ్జోన్ (25)గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని ముస్కోగీ పోలీస్ అధికారి లియన్ హమ్లిన్ తెలిపారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందని తాము భావించడంలేదని, ఏం జరిగిందో తెలియదని వ్యాఖ్యానించారు. నిందితుడు, మృతులు ఒకే ఇంట్లోనే ఉంటున్నారని, వారి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు. తెల్లవారుజామున 1.30 గంట ప్రాంతంలో కాల్పుల ఘటన గురించి తమకు సమాచారం అందినట్టు వివరించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని ఎన్‌కౌంటర్‌కు ప్రయత్నించగా తప్పించుకున్నాడని, తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. విచారణకు నిందితుడు సహకరించడంలేదని తెలిపారు. ఘటనా స్థలిలో నలుగురు చిన్నారులు, వ్యక్తి చనిపోయారని.. తీవ్రంగా గాయపడిన మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనలో గాయపడిన ఓ మహిళ ప్రస్తుతం తుస్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇదిలా ఉండగా, నిందితుడు ప్రిడ్జోన్‌ గతంలో ఓ మహిళపై దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేరాన్ని అంగీకరించిన అతడిని మూడేళ్లు పరిశీలనలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడా? అనేది నిపుణులు ద్వారా గుర్తించాలని సూచించింది. క్రీక్ ఎలిమెంటరీ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పిల్లలు చనిపోయారని, ఓ విద్యార్ధి గాయపడ్డారని ముస్కోగీ పబ్లిక్ స్కూల్స్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.


By February 03, 2021 at 06:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/five-children-among-6-killed-in-shooting-rampage-in-oklahoma-at-us/articleshow/80660561.cms

No comments