Breaking News

కొవాగ్జిన్‌‌ సరఫరా నిలిపివేయాలని చత్తీస్‌గఢ్ లేఖ.. కేంద్రం స్పందన ఇదీ


భారత్ బయోటెక్ టీకా విషయంలో ఆందోళన చెందుతూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్‌వర్దన్ గురువారం స్పందించారు. అసంపూర్తిగా ఉన్న టీకా మూడో దశ పరీక్షలు, వయల్‌పై గడువు తేదీ లేకపోవడం గురించి ఆందోళనలు ఉన్నాయంటూ చత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించే వరకు ఛత్తీస్‌గఢ్‌కు కొవాగ్జిన్ సరఫరాను నిలిపివేయాలని ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో కేంద్రానికి రాసిన లేఖను షేర్ చేశారు. కొవాగ్జిన్ విషయంలో చత్తీస్‌గఢ్ ముందు నుంచి పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రానికి మరోసారి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చత్తీస్‌గఢ్ ఆందోళన చెందుతున్న అంశాల గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి తన లేఖలో వివరణ ఇచ్చారు. టీకా షెడ్యూల్‌లో చత్తీస్‌గఢ్ వెనుకబడి ఉందని అభిప్రాయపడిన ఆయన.. దీనిపై కేంద్రానికి ఆందోళన పెరుగుతోందన్నారు. రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న టీకాలన్నీ సురక్షితమైనవేనని, వాటిని త్వరగా వినియోగించాలని హర్షవర్దన్ సూచించారు. కొవాగ్జిన్ వయల్ గడువు తేదీ గురించి మీ ఆందోళన కూడా పూర్తిగా నిరాధారమైనది.. వ్యాక్సిన్ లేబుల్‌లో పేర్కొన్న విధంగానే ఉంది అని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. లేబుల్‌తో ఒక సీసా ఫోటోను కూడా ఆయన జత చేశారు. ‘తొలి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకా పంపిణీ లక్ష్యాన్ని చత్తీస్‌గఢ్ 69.87 శాతం మాత్రమే పూర్తిచేసింది.. మొత్తం 2,09,512 లక్షల మందిలో ఫ్రంట్‌లైన్ వర్కర్లు కేవలం 9.55 శాతం మంది మాత్రమే ఉన్నారు’ అని కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. రెండు టీకాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నందున పంపిణీ గణనీయంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని హర్ష్‌వర్దన్ వ్యాఖ్యానించారు. దేశంలో వ్యాక్సినేషన్‌పై జాతీయ నిపుణుల కమిటీ ఛైర్మన్ డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. 12 రాష్ట్రాల్లో 40 శాతం కంటే తక్కువ మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకా వేశారని అన్నారు.


By February 12, 2021 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/chhattisgarh-asks-centre-to-halt-covaxin-union-health-minister-harsh-vardhans-response/articleshow/80872177.cms

No comments