Breaking News

మాయన్మార్: నిర్బంధంలో 400 మంది ఎంపీలు.. క్యాబినెట్ ఏర్పాటుచేసిన సైన్యం


మాయన్మార్‌లో ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుంటున్న ప్రజాస్వామ్యాన్ని మరోసారి సైన్యం ఖూనీచేసింది. ఐదు దశాబ్దాల తర్వాత 2015లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడగా.. గతేడాది జరిగిన ఎన్నికల్లోనూ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే, కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న కొద్ది గంటల ముందే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే ఎన్ఎల్డీ నేత , అధ్యక్షుడు సహా దాదాపు 400 మంది ఎంపీలను సైన్యం నిర్బంధించి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో మాయన్మార్‌లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే సాకుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసింది. ఏడాదిపాటు ఎమర్జెన్సీని విధించిన సైన్యం.. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రాజధాని నేపిడాలో ప్రభుత్వ గృహ సముదాయంలోనే ఎంపీలు నిర్బంధంలోనే ఉన్నారు. బయటకు వెళ్లేందుకు తమను అనుమతించడం లేదని, గృహ సముదాయంలో పోలీసులు, దాని బయట సైనికులు కాపలాగా ఉన్నారని ఓ ఎంపీ చెప్పారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోడానికి, ఫోన్‌లో సంభాషించేందుకు మాత్రం పోలీసులు తమను అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కడికైనా తరలిస్తారేమోనన్న భయంతో సోమవారం రాత్రి నిద్రపోలేదని పేర్కొన్నారు. మరోవైపు, ఉపాధ్యక్షుడు మయింట్‌ స్వెని తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించిన సైన్యం.. ఆ వెంటనే ఆయన సర్వాధికారాలను సైన్యాధిపతి మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌కు బదలాయించారు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అధికారాలను ఇలా బదలాయించేందుకు మాయన్మార్ రాజ్యాంగం అనుమతిస్తుంది. అలాగే, 13 మంది మాజీ సైనికాధికారులతో కొత్త క్యాబినెట్‌ను లయాంగ్ ఏర్పాటుచేశారు. అందులోని సభ్యులంతా మాజీ సైనికాధికారులే. కాగా మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటుతో యంగూన్ నగరంలోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అనవసర ప్రయాణాలు చేయొద్దని అక్కడి భారతీయులకు సూచించింది. కాగా, మాయన్మార్‌లో సైనిక తిరుగబాటుపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగానే స్పందించింది. ఇది ‘ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి’గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభివర్ణించారు. అంతేకాదు, ఆ దేశంపై ఆంక్షల పునరుద్ధరణకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఆంగ్ సాన్ సూకీ సహా నిర్బంధంలో ఉన్న నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని ఉద్ఘాటించారు.


By February 03, 2021 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/myanmar-crisis-detention-continue-of-elected-leader-aung-san-suu-kyi-an-400-mps/articleshow/80661044.cms

No comments