ఉత్తరాఖండ్ విలయం: 27 మృతదేహాలు లభ్యం.. ఇంకా 197 మంది గల్లంతు


ఉత్తరాఖండ్ జలవిలయంలో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాదాపు రెండు రోజులుగా సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సహా మొత్తం 500 మంది సహాయక చర్యల్లో శ్రమిస్తున్నారు. ఇప్పటిదాకా 26 మృతదేహాలను వెలికితీయగా.. మరో 197 మంది ఆచూకీ తెలియరాలేదు. గల్లంతైనవారిలో దాదాపు 150 మంది పవర్ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు కాగా మిగతావారు సమీప గ్రామాల ప్రజలు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఉత్తరాఖండ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తపోవన్-విష్ణుగడ్ ప్రాజెక్టు సొరంగాల్లో 12 మందిని.. రిషిగంగా ప్రాజెక్టు వద్ద 15 మందిని కాపాడామని వారు వివరించారు. తపోవన్ - విష్ణుగడ్ జలవిద్యుత్ కేంద్రం సొరంగంలో చిక్కుకుపోయిన 34 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది కృషి చేస్తున్నారు. సహాయక చర్యలకు భారీ యంత్ర పరికరాలు, బుల్డోజర్లు, జేసీబీలను అధికారులు అందుబాటులో ఉంచారు. సొరంగంలోపల 1.6 కిలోమీటర్ల వరకు శిథిలాలతో నిండిపోయినట్టు అనుమానిస్తున్నారు. ఆదివారం రాత్రి బాగా ఆలస్యంగా సొరంగం వద్దకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పలుగులు, పారలతో తవ్వుతూ లోపలికి దారి చేస్తున్నారు. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు.. స్నిఫర్ డాగ్స్ను తీసుకొచ్చారు. వారి ప్రాణాలు కాపాడడంపైనే ప్రధానంగా దృష్టిసారించినట్టు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. తొలి 72 గంటలు అత్యంత కీలకమని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు. సొరంగం చాలా పొడవైందని, లోపల అవసరమైన ఆక్సిజన్ ఉందని పేర్కొన్నారు. జలప్రళయానికి కారణాలపై అనిశ్చితి నెలకుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ తాజా ఉపగ్రహ ఆధారిత అంచనా ప్రకారం హిమనీనదం విస్ఫోటనం కాదు, కొండచరియలు విరిగిపడి అది వరదలకు కారణమైంది. ఎన్డీఆర్ఎఫ్ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పియూష్ రౌతేలా మాట్లాడుతూ ‘ఫిబ్రవరి 7 నుంచి ఉపగ్రహ డేటా స్పష్టంగా చూపిస్తుంది.. హిమానీనదం టెర్మినస్ వద్ద 5,600 మీటర్ల ఎత్తులో కొండచరియలు విరిగిపడటం, మంచు హిమపాతాన్ని ప్రేరేపించి, సుమారు 14 చదరపు కిలోమీటర్లు, రిషిగంగా నది దిగువ ఆకస్మిక వరద సంభవించింది’ అన్నారు. ‘సహాయక సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తున్నాయి. వాతావరణం చాలా చల్లగా ఉంది.. లోపల చిక్కుకున్నవారు ప్రాణాలతో ఉంటారని నమ్మకం ఉంది.. ఎందుకంటే అవసరమైన ఆక్సిజన్ పాయింట్లు ఉన్నాయి’ అని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే తెలిపారు. ఒకటో నెంబరు సొరంగం వెడల్లు కేవలం 25 మీటర్ల మాత్రమే.. ఒక్కసారి ఒక్క యంత్రం మాత్రమే వెళ్లగలదు. ఎందుకంటే ఇది మొత్తం బురదతో కూరుకుపోయింది.. దానిని తొలగించడం సవాల్తో కూడుకున్న విషయం’ అని డీజీపీ పేర్కొన్నారు.
By February 09, 2021 at 07:50AM
No comments