Breaking News

రాష్ట్రపతి అంకుల్ మా అమ్మకు క్షమాభిక్ష పెట్టండి.. షబ్నమ్ 12 ఏళ్ల కొడుకు అభ్యర్థన


స్వాతంత్ర భారత చరిత్రలో తొలిసారి ఓ మహిళా నేరస్థురాలిని ఉరితీయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఉన్నత చదువులు చదివి ఓ కూలీని ప్రేమించడం ఏంటి? అని నిలదీసినందుకు యూపీకి చెందిన షబ్నమ్ తన కుటుంబంలోని ఏడుగురిని అత్యంత దారుణంగా హత్య చేసింది. వీరిలో పది నెలల అభంశుభం తెలియని చిన్నారి కూడా ఉన్నాడు. 2008 ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ హత్యలు జరిగే నాటికి షబ్నమ్ ఏడు నెలల గర్భవతి కాగా.. ప్రస్తుతం ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. షబ్నమ్‌ను ఉరితీయడానికి ఏర్పాట్లు చేస్తుండగా తన తల్లికి క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆమె 12 ఏళ్ల కుమారుడు మహమ్మద్ తాజ్ వేడుకున్నాడు. ‘మా అమ్మంటే నాకు చాలా ఇష్టం.. ప్రెసిడెంట్ అంకుల్ నాకు ఒకే ఒక డిమాండ్ ఉంది.. అమ్మను ఉరితీయకుండా అడ్డుకోండి’ అని ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ బాలుడు ఓ కుర్చీపై నిలబడి, మా అమ్మను క్షమించండంటూ రాసిన పలకను చేతితో పట్టుకున్నాడు. ఆమెను క్షమించాల్సిన బాధ్యత రాష్ట్రపతిపై ఉంది.. కానీ నాకు నమ్మకం ఉంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాజ్ తన పెంపుడు తల్లిదండ్రులు, జర్నలిస్ట్ ఉస్మాన్ సైఫీ వద్ద ఉన్నారు. షబ్నమ్ కేసు గురించి కథనాలు రాసిన సైఫీ.. తరుచూ జైలుకి వెళ్లి, తన వెంట తాజ్ కూడా తీసుకెళ్తాడు. ‘నేను ఎప్పుడు జైలుకు వెళ్లినా అమ్మ నన్ను గుండెలకు హత్తుకుంటుంది.. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? బాగా చదువుతున్నావా? స్కూల్ ఎప్పుడు పెడతారు? అమ్మానాన్నలను ఇబ్బంది పెట్టుకు? అనే ప్రశ్నలు అడుగుతుంది’ అని తాజ్ వాపోయాడు. ఉస్మాన్ సైఫీ మాట్లాడుతూ.. తాజ్‌కు మేం మంచి విద్యను ఇవ్వడానికి, అతన్ని మంచి మనిషిగా జీవించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం... తన తల్లి నేరానికి పాల్పడినప్పటికీ అతడు నేరస్థుడు కాదు అన్నారు. మరోవైపు, యూపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు షబ్నమ్‌ను ఉరి తీయడానికి అమరోహ్ కోర్టు ఓ తేదీని నిర్ణయించనుంది. ఉరిశిక్ష అమలుకు మథుర జైలు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిర్భయ దోషులను ఉరితీసిన తలారి పవన్ జల్లద్ ఆమెను ఉరి తీయడానికి సిద్ధమయ్యాడు. ఇంగ్లిష్, జాగ్రఫీలో రెండు మాస్టర్ డిగ్రీలు తీసుకున్న షబ్నమ్ తన ఇంటికి సమీపంలో ఉండే కర్రల కోత డిపోలో పనిచేసే సలీంను ప్రేమించింది. దీనికి షబ్నమ్ కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనిని వ్యతిరేకించిన కుటుంబసభ్యులను అత్యంత కిరాతకంగా హత్యచేసింది. షబ్నమ్ 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోగా.. దానిని ఆయన తిరస్కరించారు.


By February 20, 2021 at 11:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/son-of-death-row-convict-up-moman-shabnam-ali-asks-president-for-mercy/articleshow/81122971.cms

No comments