Breaking News

మలుపు తిరిగిన కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. కేంద్రపాలిత ప్రాంతంగా ముంబై


పలు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఇటీవల కాలంలో మరోసారి ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఆంధ్రా-కర్ణాటకల మధ్య సరిహద్దు వివాదం అపరిష్కృతంగా ఉంది. తాజాగా, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. కర్ణాటక సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను యూనియన్ టెరిటోరీగా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం డిమాండ్‌ చేశారు. ఉద్ధవ్ వ్యాఖ్యలకు కర్ణాటక కౌంటర్ ఇచ్చింది. మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యలను ఖండించిన కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి‌.. ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్రాన్ని కోరారు. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనానికి కట్టుబడి ఉన్నామని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఇటీవల ఠాక్రే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదాలపై రూపొందించిన పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించగా.. ఈ కార్యక్రమంలో ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సరిహద్దు వివాదాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కర్ణాటక కోర్టు ధిక్కారానికి పాల్పడి బెల్గామ్‌ను బెళగావిగా పేరు మార్చారు.. రాష్ట్రానికి రెండో రాజధానిగా చేసి, అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు’ అని ఆరోపించారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అటు ఠాక్రే వ్యాఖ్యలకు కర్ణాటక దీటుగా స్పందించింది. డిప్యూటీ సీఎం లక్ష్మణ్ బెలగావీలో మాట్లాడుతూ.. ‘గతంలో ముంబయి ప్రాంతంలోని భాగంగానే బెలగావీ ఉండేది.. మా రాష్ట్రంలోని కొంతమంది ప్రజలు ముంబయి-కర్ణాటక ప్రాంతానికి చెందినవారే. అందువల్ల ముంబయిపై మాకూ హక్కు ఉంది. ఆ ప్రాంతాన్ని కర్ణాటకలో కలపాలి.. అప్పటి వరకు ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నాం.. మేం డిమాండ్ చేసిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది’ అని లక్ష్మణ్‌ సవాడీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని విశ్వాసంగా ఉన్నామన్నారు. వివాదాస్పద ప్రాంతంపై మహాజన్ కమిషన్ నివేదిక ఫైనల్ అని అన్నారు. ఒకప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న బెళగావి తదితర ప్రాంతాలు ఆ తర్వాత మైసూరు రాష్ట్రంలో కలిశాయి. అక్కడ ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష మరాఠీ.. కాబట్టి వాటిని తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్‌ చేస్తోంది. దీనిపై బెళగావి కేంద్రంగా 1948లో ఏర్పడిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి పోరాటం కొనసాగిస్తోంది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు జనవరి 17న ఆ ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు. దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బెళగావి తదితర ప్రాంతాలు కర్ణాటకలోనే ఉండాలంటూ మహజన్‌ కమిషన్‌ 1967లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను వ్యతిరేకిస్తోన్న మహరాష్ట్ర.. సరిహద్దు ప్రాంతాలను తమ రాష్ట్రంలో విలీనం చేయాలంటూ డిమాండ్‌ చేస్తోంది. ఆ మధ్య ఈ వివాదం కాస్త సద్దుమణిగినట్లే కన్పించినా.. ఇటీవల ఠాక్రే వ్యాఖ్యలతో మళ్లీ రాజుకుంది.


By January 28, 2021 at 01:00PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-dy-cm-seeks-ut-status-to-mumbai-after-uddhav-thackeray-similar-status-to-border-areas/articleshow/80495842.cms

No comments