Breaking News

ట్రంప్ మద్దతుదారులు బీభత్సం.. ఒకరు మృతి.. రాజధాని వాషింగ్టన్ డీసీలో కర్ఫ్యూ


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ నేత జో బైడన్‌ను కొత్త అధ్యక్షుడిగా ధ్రువీకరించే ప్రక్రియ కోసం ఎలక్టోరల్ కాలేజ్ సమావేశం కాగా.. అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో మద్దతుదారులు పెద్ద ఎత్తున అమెరికా క్యాపిటల్‌ భవనంలోకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. ఓ మహిళ మృతిచెందింది. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో జరిగిన ఘర్షణలో ఆమె మెడపై తూటా గాయమైంది. దీంతో ఆమెను చికిత్స కోసం అస్పత్రికి తరలించినా.. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ చనిపోయింది. జో బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు యూఎస్ కాంగ్రెస్ భవనంలోకి చొచ్చుకొచ్చారు. అమెరికా జెండాలు పట్టుకుని, ట్రంప్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ చొచ్చుకురావడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించడంతో సైన్యాన్ని రంగంలోకి దింపారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతోనే కేంద్ర బలగాలను రప్పించినట్టు శ్వేతసౌధం పేర్కొంది. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. క్యాపిటల్‌ భవనంలో అందరూ సంయమనం పాటించాలని కోరారు. తన మద్దతుదారులు పోలీసులకు సహకరించాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వెంటనే ఆందోళనకారులు క్యాపిటల్‌ భవనం విడిచివెళ్లాలని సూచించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ స్పందించారు. ‘ఈ చర్యను ఇంతటితో ఆపేయాలని, ఆందోళనకారులను ఆపడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ట్రంప్‌ వెంటనే జాతీయ ఛానల్‌లో ప్రకటన చేయాలని’ బైడెన్‌ ట్వీట్‌ చేశారు. కాగా, వాషింగ్టన్‌‌లో కర్ఫ్యూ విధించిన అధికారులు... అత్యవరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రక్షణ బలగాలు క్యాపిటల్‌ భవనంను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనను యూఎస్ కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ట్రంప్ మద్దతుదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యురాలు ఎలైన్ లూరియా ట్విట్టర్‌లో స్పందిస్తూ... ‘సమావేశం భవనం బయట పైప్ బాంబు ఉందని తెలియడంతో కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. అధ్యక్షుడి మద్దతుదారులు కాపిటల్‌లోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.. తుపాకీ కాల్పుల శబ్దం విన్నాను’ అని ట్వీట్ చేశారు. ‘ఈ రోజును దేశాన్ని గుర్తించలేదు.. దీనికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులు అరాచకత్వం తోటి అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించడానికి అర్హత లేదు’ అని దుయ్యబట్టారు. మరో సభ్యురాలు కూడా ఇదే విధంగా స్పందించారు. ‘భయంతో కార్యాలయాన్ని వీడాల్సి వచ్చింది.. క్యాపిటల్ పోలీసుల పట్ల ఆందోళనకారులు అవమానకరంగా వ్యవహరించడం చూశాం.. ఇది చాలా తప్పుడు.. ఇది మనమే ఎవరో కాదు.. ఈ రోజు మన దేశం కోసం నా హృదయం ముక్కలయ్యింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


By January 07, 2021 at 07:10AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-donald-trump-supporters-storm-capitol-curfew-in-washington-dc/articleshow/80144543.cms

No comments