Breaking News

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. గూడ్స్ రైలెక్కి సజీవదహనమైన బాలుడు


ప్రమాదమని తెలిసినా సెల్ఫీ కోసం గూడ్సు రైలెక్కి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి సజీవ దహనమైన ఘటన జార్ఖండ్‌లోని రామ్‌ఘడ్ జిల్లా మేల్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. చితార్‌పూర్ గ్రామానికి చెందిన బాలుడు సత్యం సోని (16) స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం తన స్నేహితులతో ఆడుకుంటూ.. వారితో కలిసి మేల్ రైల్వేస్టేష‌న్‌కు వచ్చాడు. అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును చూసి సెల్ఫీ తీసుకోవాలని భావించి దాని పైకి ఎక్కాడు. రైలుపైకి ఎక్కిన బాలుడు.. సెల్ఫీ సందడిలో పై ఉన్న హైటెన్షన్ వైరును గమనించలేదు. సెల్ఫీ తీసుకుంటుండగా బాలుడికి హైటెన్షన్ వైర్లు తగలడంతో సజీవదహనమైనట్టు ఆర్పీఎఫ్ అధికారి ఆర్కే తివారీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని అన్నారు. సెల్ఫీ పిచ్చి బాలుడి ప్రాణాన్ని బలిగొనడంతో విషాదం అలముకుంది. ఒడిశాలోని ఓ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలుపై సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన 13 ఏళ్ల బాలుడు హైవోల్టేజ్ ఎలక్ట్రిక్ లైనును పట్టుకోవడంతో మంటల్లో చిక్కి పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్యాసింజర్ రైలు రెండు బోగీలు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. మూడేళ్ల కిందట సెల్ఫీలు తీసుకుంటుండగా బ్యాలెన్స్ తప్పి సరస్సు మధ్యలో పడవ బోల్తా పడిన ఘటన నాగ్‌పూర్‌లో సంభంవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.


By January 12, 2021 at 12:09PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/teen-climbs-train-for-selfie-electrocuted-by-high-tension-wires-in-jharkhand/articleshow/80228037.cms

No comments