Breaking News

నది ఒడ్డున బంగారు, వెండి నాణేలు.. భారీగా తరలివచ్చి తవ్వకాలు.. వీడియో వైరల్


నదీతీరంలో పురాతన బంగారు, వెండి నాణేలు దొరుకుతున్నాయని ప్రచారం జరగడంతో జనం భారీగా ఎగబడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాజ్‌గఢ్ జిల్లా శివపుర గ్రామానికి సమీపంలోని పార్వతీ నదిలో పురాతన బంగారు, వెండి నాణేలు లభిస్తున్నాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పార్వతీ నదీ తీరానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా చేరుకుని నాణేలు కోసం తవ్వకాలు జరుపుతున్నారు. కానీ ఒక్కరికీ కూడా బంగారు లేదా వెండి నాణెం లభించలేదు. అయినా సరే, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆశగా అక్కడికి చేరుకుంటున్నారు. దీనిపై కురావర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జి రామ్‌నరేశ్‌ రాథోర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వదంతులను ఎవరు వ్యాప్తి చేశారో తెలియదని అన్నారు. గత నాలుగు రోజులుగా ప్రజలు నదీ తీరానికి తండోపతండాలుగా వచ్చిన తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. నది ఒడ్డును తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించినట్టు పోలీసు అధికారి పేర్కొన్నారు. రాజ్‌గఢ్, సెహోర్ జిల్లాలను వేరుచేసే సమీపంలో ఉండే గ్రామాల ప్రజలు నాణేల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ‘ఇవన్నీ వదంతులే.. ఆదివారం అధికారుల బృందం అక్కడ పర్యటించి, విచారణ జరిపింది.. అక్కడ ఎటువంటి నాణేలు దొరకలేదని నిర్ధారించింది.. ఇవన్నీ వదంతులేనని చుట్టుపక్కల గ్రామాలలో చాటింపు వేశాం.. తవ్వకాలు జరిపిన సగం మంది వెనక్కు వచ్చారు’ అని రాజ్‌గఢ్ జిల్లా కలెక్టర్ నీరజ్ సింగ్ అన్నారు. అయినా కొందరిలో ఆశచావక ఇంకా తవ్వకాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..‘వారం రోజులుగా వందలాది మంది తవ్వకాలు జరుపుతున్నారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో వారి సైన్యం ఈ నది గుండా వెళ్తూ కొంత నిధిని ఇక్కడ దాచిపెట్టిందని స్థానికులు నమ్ముతారు. తమకు వెండి నాణేలు దొరికాయని కొందరు చెబుతున్నారు. అంతేకాదు, ఆ నాణేలపై పర్షియా భాషలో ఏదో రాసి ఉన్నట్టు పేర్కొంటున్నారు. అయితే, వీటిని అధికారులు తోసిపుచ్చారు’.


By January 12, 2021 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/villagers-digging-river-bed-for-nearly-a-week-in-search-of-gold-and-silver-coins-in-madhya-pradesh/articleshow/80227416.cms

No comments