Breaking News

ఢిల్లీలో పాక్ అనుకూల నినాదాలు.. ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు


ఢిల్లీలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన విషయం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున ఖాన్ మార్కెట్‌లో హఠాత్తుగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అన్న నినాదాలు మిన్నంటాయి. ఈ నినాదాలు ఐదుగురు వ్యక్తులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు యువకులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందన్న దానిపై విచారిస్తున్నారు. ఖాన్ మార్కెట్‌ మెట్రో స్టేషన్ వద్ద కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేస్తున్నారంటూ తెల్లవారుజాము ఒంటి గంటకు తమకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై ఆ యువతీ యువకులు స్పందిస్తూ... తాము ఇండియా గేట్‌ పరిసర ప్రాంతాలను చూడడానికి వచ్చామని తెలిపారు. తామంతా వివిధ దేశాలకు చెందిన పర్యాటకులమని, తమలో పాకిస్థాన్ పౌరులు ఉన్నారని తెలిపారు. వారి దేశాల పేర్లతో పిలుచుకుంటున్నామని పోలీసులకు సమాధానమిచ్చారు. ఒక వ్యక్తిని పాక్‌ పేరుతో పిలుస్తున్న సమయంలో సహజంగానే ‘పాకిస్థాన్ జిందాబాద్’ అన్న నినాదం వచ్చిందని వారు పేర్కొనడం గమనార్హం. వీరంతా అద్దెకు వాహనాలు తీసుకుని బైక్ రేసింగ్‌లో పాల్గొన్నట్టు సమాచారం. వీరంతా తమ పేర్లను వెల్లడించలేదని తెలుస్తోంది.


By January 24, 2021 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-zindabad-slogan-raised-near-delhis-khan-market-probe-underway/articleshow/80431595.cms

No comments