అంత్యక్రియలకు కట్టెల స్థానంలో ఆవు పిడకలు.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం


శ్మశానవాటికల్లో అంత్యక్రియలకు వాడే కట్టెల స్థానంలో ఆవుపేడతో చేసిన పిడకలను వినియోగించాలని దక్షిణ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్మశానవాటికల్లో దహన సంస్కారాలకు ఇక నుంచి కట్టెల స్థానంలో ఆవుపేడతో చేసిన పిడకలను వాడాలని నిర్ణయించినట్లు ఢిల్లీ నగర మేయర్ అనామిక వెల్లడించారు. ఆవుపేడతో చేసిన పిడకలతో మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని ఆమె అన్నారు. ఆవు పేడతో చేసిన పిడకలను శ్మశానవాటికల వద్ద సిద్ధంగా ఉంచామని మేయర్ చెప్పారు. ఈ నిర్ణయానికి కొన్ని సామాజిక సంస్థల నుంచి మద్దతు లభిస్తోందని మేయర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలకు వీలైనంత త్వరగా అందుబాటులోకి రానుందని అనామిక అన్నారు. ఆవు పేడ పిడకలతో శవాల దహనానికి మున్సిపల్ కార్పొరేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్కువ ఖర్చు వల్ల బలహీన వర్గాలకు ప్రయోజనకరంగా ఉండటంతోపాటు పిడకలకు ఆవుపేడ ఉపయోగించడం మన సంస్కృతి అని మేయర్ అనామిక వివరించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పగ్గాలు బీజేపీ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్మశానవాటికల్లో ఆవు పేడతో చేసిన పిడకలు ఉపయోగించాలనే నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. గంగా నది కూడా కలుషితం కావడంతో కాలుష్యాన్ని నివారించడానికి, పర్యావరణ పరిరక్షణకు యూపీ ప్రభుత్వం 2018లో దహనానికి కలప స్థానంలో దేశీయ ఆవు పేడతో చేసిన పిడకలను వినియోగించాలని తీర్మానించింది. దీని వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, చెట్లు నరకడం తగ్గుతుంది. పిడకలతో మృత శరీరాన్ని దహనం చేయడం వల్ల ఎటువంటి దోషం ఉండదని పండితులు అంటున్నారు. దేశీయ ఆవుపేడతో చేసిన పిడకలతో ఇప్పటికే నాగపూర్, జైపూర్, రోహతక్, జలగావ్, ఇండోర్, రాయ్పూర్, రూర్కెలాల్లో దహన సంస్కారాలు నిర్వ హిస్తుంటారు. గోమూత్రం, గోమయం ఎంతో పవిత్రమైనవని..అందుకే గో ఆధారితమైన పిడకలను వాడడం వల్ల పర్యావరణానికి హాని కలుగదని, దహన సంస్కారాలలో దోషం ఉండదని హిందూ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి.
By January 25, 2021 at 11:41AM
No comments