Breaking News

నిరాశ్రయులను తరిమేసిన మున్సిపల్ సిబ్బంది.. వీడియో వైరల్ కావడంతో స్పందించిన సీఎం


గత నాలుగేళ్లుగా దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ తొలిస్థానం దక్కించుకుంటోంది. అయితే, ఈ నగరంలోని మున్సిపల్ కార్మికుల నిర్వాకంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరాశ్రయులైన వృద్ధులను మున్సిపల్ కార్మికులు నగరం నుంచి శివార్లలోకి డంపింగ్ వాహనంలో తరలించడానికి ప్రయత్నిస్తుండగా దానిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శీతాకాలం కారణంగా జాతీయ రహదారుల పక్కన ఉండొద్దంటూ ప్రభుత్వం చేపట్టిన చర్యలను క్షిప్రా ప్రాంతంలోని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించడంతో నిరాశ్రయులను మున్సిపల్ సిబ్బంది తిరిగి నగరంలోకి తీసుకుని వచ్చారు. హైవేపై ఓ ట్రక్కును నిలిపి అందులో నిరాశ్రయులైన వృద్ధులను మున్సిపల్ సిబ్బంది ఎక్కిస్తున్నట్టు వీడియోలో ఉంది. బలహీనంగా ఉన్న ఓ వృద్ధురాలిని డంపింగ్ ట్రక్కులోకి బలవంతంగా ఎక్కించడం... పండుటాకు నిటారుగా కూర్చోలేక ఇబ్బంది పడుతుంటే ఓ వ్యక్తి ఆమెను పట్టుకున్న దృశ్యం అందరినీ కదిలిస్తోంది. రహదారి పక్కన ఉండే నిరాశ్రయులను మున్సిపాల్టీవాళ్లు ట్రక్కులో ఎలా ఎక్కించి తీసుకెళ్లిన విషయాన్ని ఓ వీడియోలో బాధితుడు వివరించాడు. మున్సిపల్ సిబ్బంది అనాగరిక చర్యలను తీవ్రంగా వ్యతిరేకించడంతో తిరిగి వారిని నగరంలో అదే వాహనంలో తీసుకొచ్చినట్టు ఇంకో వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషినల్ కమిషనర్ అభయ్ రాజంగోకర్ మాట్లాడుతూ.. వాస్తవానికి నిరాశ్రయులను నైట్ షెల్టర్‌కు తమ సిబ్బంది తరలించడానికి ప్రయత్నించారని అన్నారు. వారి నగర శివారులో వదిలిపెట్టడానికి తీసుకెళ్లారనే ఆరోపణలను తోసిపుచ్చారు. తాజా వీడియోలపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. అధికార బీజేపీపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలను పార్టీ నుంచి తొలిగించినట్టే నిరాశ్రయులైన వృద్ధులను పరిశుభత్ర పేరుతో నగరం నుంచి వెళ్లగొడుతోందని మండిపడింది. ‘అద్వానీ, జోషీ, యశ్వంత్ సిన్హా వంటి చాలా మంది వృద్ధ నాయకులను పక్కనబెట్టినట్టే పరిశుభ్రత పేరిట ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వృద్ధులను చలిలో వదిలేశారు.. అధికారులు ఏం చేయగలరు?... వారు బీజేపీ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తున్నారు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలౌజా విమర్శించారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో బీజేపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఘటనకు కారకులపై సరైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశించారు.


By January 30, 2021 at 12:00PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/on-camera-municipal-workers-caught-dumping-homeless-outside-city-in-indore/articleshow/80598311.cms

No comments