Breaking News

కరోనా వేళ.. ప్రజలను కాపాడటంలో తెలుగు రాష్ట్రాలు టాప్: ఎకనమిక్ సర్వే కితాబు


లాక్‌డౌన్ విధించడంతోపాటు ప్రభుత్వం తీసుకున్న ఇతర చర్యల వల్ల తీసుకోవడం వల్ల మన దేశంలో కరోనా బారి నుంచి లక్ష మంది ప్రాణాలను కాపాడగలిగామని ప్రభుత్వం విడుదల చేసిన ఎకనమిక్ సర్వే 2020-21 వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా 37 లక్షల మందికిపైగా కోవిడ్ బారిన పడకుండా ఉండగలిగారని ఎకనమిక్ సర్వే తెలిపింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్ అత్యుత్తమ పని తీరు కనబర్చాయని ఎకనమిక్ సర్వే కితాబిచ్చింది. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మహమ్మారి బారి నుంచి ఎక్కువ మంది ప్రాణాలను కాపాడాయని ప్రశంసించింది. కరోనా రోగులకు తెలుగు రాష్ట్రాలు మెరుగైన చికిత్స అందించాయని కొనియాడింది. కరోనా వ్యాప్తిని తగ్గించడం, ప్రాణాలను కాపాడటంలో మహారాష్ట్ర పేలవమైన పనితీరు కనబర్చిందని పేర్కొంది. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బిహార్‌లలో జనాభా ఎక్కువ. బిహార్, మహారాష్ట్ర జనాభా దాదాపు సమానమైనప్పటికీ.. బిహార్‌, యూపీతో పోలిస్తే మహారాష్ట్రలో జనసాంద్రత తక్కువ. కానీ యూపీ, బిహార్‌లలో అంచనాల కంటే చాలా తక్కువ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. భారత జనసాంద్రత (చ.కి.మీ.కు 382 మంది)తో పోలిస్తే.. యూపీ (చ.కి.మీ.కు 690), బిహార్ (చ.కి.మీ.కు 881) చాలా ఎక్కువ. కానీ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ రెండు రాష్ట్రాలు కరోనాను కట్టడి చేయడంతో.. భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. కరోనా కేసుల సంఖ్య 500-600 ఉండగానే భారత్ అప్రమత్తమైంది. మార్చి నుంచి మే నెలారంభం వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుపర్చింది. దీంతో కరోనా పీక్ స్టేజీని సెప్టెంబర్ వరకు వాయిదా వేయగలిగారు. లాక్‌డౌన్ కారణంగా వైద్య సదుపాయాలు మెరుగుపర్చుకోవడానికి, కేసులు ఒకేసారి పెరగకుండా చూసుకోవడానికి సమయం చిక్కింది.


By January 30, 2021 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-telangana-and-andhra-pradesh-saved-the-mosti-lives-from-covid-19-pandemic-says-economic-survey-report/articleshow/80596126.cms

No comments