Breaking News

ఆధార్ చట్టబద్ధత తీర్పుపై రివ్యూకు నిరాకరించిన సుప్రీం.. 4:1 మెజార్టీతో తీర్పు


కేంద్రం తీసుకొచ్చిన ‘ఆధార్‌ చట్టం’రాజ్యంగబద్ధమైనదేనంటూ 2018లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ తీర్పు సమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజార్టీతో బుధవారం తీర్పు వెలువరించింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఒక్కరే భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తూ విడిగా తీర్పును రాశారు. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. 2016లో ఆధార్‌ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు దానిని ద్రవ్య బిల్లుగా స్పీకర్ నిర్ణయించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. 2018లో ఆధార్‌ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై వెలువడిన తీర్పులోనూ జస్టిస్‌ చంద్రచూడ్‌ తన అసమ్మతిని వ్యక్తీకరించారు. ఆధార్‌ బిల్లును ద్రవ్య బిల్లుగా పేర్కొనడం రాజ్యాంగాన్ని వంచించడమేనని, దానిని రద్దు చేయాలని పేర్కొన్నారు. తాజాగా దాఖలైన రివ్యూ పిటిషన్లను తిరస్కరించే ముందు ఆధార్‌ చట్టం చెల్లుబాటు అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిందని జస్టిస్‌ చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. ‘స్పీకర్ ద్రవ్య బిల్లుగా ధ్రువీకరించడం, ఉత్పన్నమయ్యే సమస్యలపై రోజర్ మాథ్యూ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఖచ్చితత్వాన్ని అనుమానించింది.. ఈ సమీక్ష పిటిషన్ల విషయంలోనూ ఖచ్చితత్వంపై మరొక రాజ్యాంగ ధర్మాసనం వ్యక్తం చేసిన సందేహం, ఈ దశలో తీర్పును సమీక్షించడానికి ఎటువంటి ఆధారం లేదని చెప్పడం రాజ్యాంగపరమైన లోపం.. విస్తృత ధర్మాసనం నిర్ణయం పుట్టస్వామి కేసులో రాజ్యాంగపరమైన అంశాలపై వ్యక్తీకరించిన కారణాల చెల్లుబాటుపై కాదనలేని ప్రభావాన్ని చూపుతుంది’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ‘ఈ సమీక్ష పిటిషన్లను కొట్టివేసి, రోజర్ మాథ్యూ కేసులో విస్తృత ధర్మాసనం మెజారిటీ అభిప్రాయం విశ్లేషణతో విభేదిస్తే, అది తీవ్రమైన పరిణామాలను దారితీస్తుంది..- కాబట్టి రోజర్ మాథ్యూ కేసులో సూచించిన ప్రశ్నలను ధర్మాసనం నిర్ణయించే వరకు ప్రస్తుత బ్యాచ్ సమీక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉంచాలి.. రాజ్యాంగ సూత్రాలు, న్యాయ నియమం సమీక్ష పిటిషన్లపై నిర్ణయం విస్తృత ధర్మాసనం సూచన కోసం వేచి ఉండాలని నేను కోరుతున్నాను’ అని వ్యాఖ్యానించారు. రివ్యూ పిటిషన్లు అన్నిటినీ సమగ్రంగా పరిశీలించామని, ఆధార్‌ చట్టాన్ని సమర్థిస్తూ వెలువడిన 2018 తీర్పును సమీక్షించాలన్న పిటిషినర్ల వాదనలకు బలం చేకూర్చే అంశాలేవీ లేవని మిగతా న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాలు, పాఠశాలల్లో ప్రవేశాలను ఆధార్‌తో ముడిపెట్టే నిబంధనలను మాత్రం 2018లోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది.


By January 21, 2021 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-five-judge-bench-rejects-aadhaar-review-plea-in-41-verdict/articleshow/80379916.cms

No comments