Breaking News

ఇండోనేషియా: కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి


ఇండోనేషియాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండుచోట్ల కొండచరియలు విరిగిపడిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. పశ్చిమ జావాలో శనివారం మధ్యాహ్నం తొలుత సిహంజంగ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడగా.. సాయంత్రం సహాయక చర్యలు కొనసాగుతుండగా మరోసారి విరిగిపడ్డాయి. కొండచరియలు వంతెనపై పడటంతో ఆ గ్రామానికి దారులు మూసుకుపోయాయి. దీంతో సహాయక చర్యలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ యంత్రాలను తరలించడానికి అవకాశం లేకపోవడంతో సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘భారీ వర్షాలు కురవడంతో మట్టి జారి సిహంజంగ్‌ వద్ద తొలుత కొండచరియలు విరిగిపడ్డాయని ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధికార ప్రతినిధి రాదిత్య జతీ తెలిపారు. తొలుత కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపడుతుండగా మరోసారి విరిగిపడ్డాయని అన్నారు. ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం. అక్రమంగా ప్రజలు బంగారు నిక్షేపాల కోసం మైనింగ్ నిర్వహించడం, అస్థిర నేలలు ఈ పరిస్థితికి దోహదం చేస్తాయి. ఇదిలా ఉండగా.. లా నినా ప్రభావంతో దేశంలో వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని గతేడాది అక్టోబరులోనే ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడా హెచ్చరించారు. మార్చి వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైడ్రోమెటోరోలాజికల్ విపత్తును ఎదుర్కొడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఎంత మంది ఆచూకీ గల్లంతయ్యిందనే విషయం తెలియాల్సి ఉందని స్థానిక అధికారులు పేర్కొన్నారు.


By January 10, 2021 at 12:30PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/more-than-12-died-and-18-injured-landslide-after-heavy-rains-in-indonesia/articleshow/80196786.cms

No comments