Breaking News

ఎర్రకోట ఘటన తర్వాత 100 మంది రైతులు మిస్సింగ్.. వారంతా ఏమయ్యారు?


కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు.. రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా బయటకు వచ్చిన ఓ వార్త కలకలం రేపుతోంది. ఎర్రకోట ఘటనల అనంతరం నిరసనల్లో పాల్గొన్న 100 మందికి పైగా రైతులు కనిపించడం లేదంటూ పంజాబ్‌ మానవ హక్కుల సంస్థ శనివారం ప్రకటించింది. వీరిలో మోగాలోని తతారీవాలా గ్రామానికి చెందిన 12 మంది రైతులు ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, ర్యాలీలో పాల్గొని ఆచూకీ లేనివారి జాబితాలు తమకు అందుతున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్‌ సింగ్‌ వెల్లడించారు. సమగ్ర పరిశీలన అనంతరం అదృశ్యమైన వారి పేర్లను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయ సహాయానికి సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ, ఖల్రా మిషన్‌, పంథీ తాల్‌మేల్ సంఘటన్, పంజాబ్‌ మానవహక్కుల సంస్థ ప్రకటించాయి. కాగా, 400 మందికి పైగా నిరసనకారులు పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్నారని సామాజిక కార్యకర్త సరాబ్జీత్‌ సింత్‌ వెర్కా ఆరోపించారు. వీరిలో కొందరిని తీహార్‌ జైలుకు తరలించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. మరోవైపు, ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు కారకులైనవారిగా అనుమానిస్తున్న 18 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో పశ్చిమ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ 18 మందిలో ఏడుగురు పంజాబ్‌లోని బంథిండా జిల్లా తల్వాండీ సాబో డివిజన్ పరిధిలోని బంగీ నిహాల్ సింఘ్ గ్రామానికి చెందినవారు. ఈ గ్రామానికి చెందిన రైతులు జనవరి 23న రెండు ట్రాక్టర్లతో రిపబ్లిక్ డే ర్యాలీకి బయలుదేరి వెళ్లారు. మోగాకు చెందిన 11 మందిని నంగలోయి పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఢిల్లీ సిక్కు గురుద్వార్ మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీదర్ సింగ్ సిర్సా తెలిపారు. అటు అలీపూర్, నరేలాలోనూ అరెస్ట్‌లు జరిగినట్టు తెలుస్తోంది. అరెస్టయివారిలో చాలా మందిపై ప్రజా ఆస్తులు ధ్వంసం, పురాతన కట్టడాలు, పురావస్తు ప్రాంతాలు, అంటువ్యాధుల నిరోధక చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.


By January 31, 2021 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/over-100-farmers-from-punjab-missing-after-red-fort-incident-says-human-rights-commission/articleshow/80609404.cms

No comments