Breaking News

శబరిమలలో మహిళల ప్రవేశం: ఆ నిబంధన తొలిగించిన కేరళ సర్కారు.. మరోసారి వివాదం


శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై వివాదం నెలకున్న విషయం తెలిసిందే. భౌతిక కారణాలను చూపి మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం వారి హక్కులకు భంగం కలిగించినట్టేనంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నించగా.. అయ్యప్ప భక్తులు ఉద్యమించారు. దీంతో కేరళ సర్కారు వెనక్కు తగ్గి 50 ఏళ్లలోపు మహిళ ప్రవేశంపై నిషేధం కొనసాగిస్తోంది. మరోవైపు, సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విచారిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మండల-మకరవిళక్కు పూజలకు తెరుచుకోగా.. విర్చువల్ క్యూ బుకింగ్‌ వెబ్‌సైట్ నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధాన్ని తొలగించారు. తొలుత అయ్యప్పస్వామి దర్శనం కోసం రోజుకు 1,000 మందిని అనుమతించగా.. తర్వాత దానిని 2,000కి పెంచారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్ డిసెంబరు 2 నుంచి ప్రారంభం కాగా.. 50ఏళ్లలోపు, 65 ఏళ్లు దాటిన మహిళలకు ఆలయం ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ నిషేధాన్ని డిసెంబరు 8న ఉన్నట్టుండి తొలగించింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మూడు దశల ఎన్నికల నేపథ్యంలో మహిళల ప్రవేశంపై ‘ప్రభుత్వ వైఖరిలో మార్పు’తప్పుడు సంకేతాలు పంపుతోంది. 2010 నుంచి పోర్టల్‌ను నిర్వహిస్తున్న కేరళ పోలీసులు ఇప్పుడు అకస్మాత్తుగా ఈ ఆంక్షలను ఉపసంహరించుకున్నారు. ఈ ఆంక్షల స్థానంలో దర్శనానికి వచ్చే 60 నుంచి 65 ఏళ్లలోపు మహిళలు తమ వెంట మెడికల్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని సూచించింది. మండల పూజల కోసం నవంబరు 16న అయ్యప్ప ఆలయాన్ని తెరవగా.. కరోనా నేపథ్యంలో 10లోపు, 65 ఏళ్లు దాటిన వారికి దర్శనానికి అనుమతి లేదని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. భక్తుల సంఖ్యను పెంచిన తర్వాత కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఛైర్మన్ ఎన్ వాసు మాట్లాడుతూ.. మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తూ ఎటువంటి ఆదేశాలను జారీచేయలేదన్నారు. అంతేకాదు, 50ఏళ్లలోపు మహిళల ప్రవేశం అనే అంశానికి ప్రస్తుతం అంత ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించారు. తొలుత అయ్యప్ప స్వామి దర్శనం కోసం రోజుకు 1,000 మంది భక్తులనే అనుమతించగా.. ప్రస్తుతం రోజుకు 2 వేల మందిని అనుమతిస్తున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 1,000 మంది, వారాంతాలు, సెలవు రోజుల్లో 2 వేల మందిని దర్శనానికి అనుమతించేవారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 2 వేల మందిని, శని, ఆదివారాల్లో రోజుకు 3 వేల మందిని అనుమతిస్తున్నారు.


By December 10, 2020 at 07:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/restrictions-on-womens-entry-at-sabarimala-ayyappa-temple-withdrawn-from-portal/articleshow/79654277.cms

No comments