Breaking News

నవంబరులోనే దేశంలోకి యూకే స్ట్రెయిన్.. ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు


దేశంలోకి యూకే కరోనా స్ట్రెయిన్ ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు యూకే నుంచి వచ్చిన 20 మందికి కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ స్ట్రెయిన్ డిసెంబర్‌కు ముందే దేశంలోకి ప్రవేశించిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలో వెలుగుచూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ డిసెంబరుకు ముందే భారత్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని ఆయన అన్నారు. అక్కడ సెప్టెంబరు చివరిలోనే కొత్త స్ట్రెయిన్ మొదలైందని, మన దేశంలోకి నవంబరు నెలలోనే ప్రవేశించే అవకాశం ఉందని రణదీప్ స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ కేసులు 20 వెలుగుచూశాయని రణదీప్ చెప్పారు. యూకే నుంచి నవంబరులో వచ్చినవారి నమూనాలను పరీక్షిస్తున్నట్టు వెల్లడించారు. కొత్త కరోనా స్ట్రెయిన్ నవంబరు నెలలోనే భారతదేశంలోకి ప్రవేశించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. జన్యుమార్పులు చెందిన యూకే కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి వేగంగా ఉందని వివరించారు. యూకే స్ట్రెయిన్ వ్యాప్తిని నిరోధించడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని గులేరియా సూచించారు. ప్రస్తుత వైరస్ కంటే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే కొత్త స్ట్రెయిన్ ప్రబలకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం నిర్ధారణ అయిన కేసులు పెద్ద సంఖ్య కాదు, కానీ ఆ సమయంలో యూకే నుంచి ప్రయాణాలు కొనసాగుతున్నాయి.. హాలెండ్ వెల్లడించిన డేటాను పరిశీలిస్తే డిసెంబరులో యూకే ప్రకటనకు ముందే అక్కడ కొత్త స్ట్రెయిన్ కేసులు నిర్ధారణ అయ్యాయి.. కాబట్టి, మనదేశంలోకి డిసెంబరుకు ముందే ప్రవేశించే అవకాశం ఉంది.. నవంబరు చివరి లేదా డిసెంబరు తొలివారంలో వచ్చి ఉండొచ్చు’ అని అన్నారు. పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ కొన్ని మార్పులకు గురయ్యింది.. ప్రి-ఎపిడిమియాలజికల్ డేటా ప్రకారం యూకే స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది అని అన్నారు. ‘టీకాలు స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా ఉండే యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ద్వారా పనిచేస్తాయి.. స్పైక్ ప్రోటీన్ యాంటిజెన్.. ఇది యాండీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. కానీ, టీకా స్పైక్ ప్రోటీన్‌పై బహు విధాలుగా పనిచేస్తుంది.. స్పైక్ ప్రోటీన్ కొద్ది ప్రాంతంలో మాత్రమే మ్యుటేషన్ సంభవించింది.. కాబట్టి యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంలో ఇప్పటికీ టీకా ప్రభావవంతంగా ఉంటుంది.. టీకాలు సెల్-మెడియేటెడ్ రోగనిరోధక శక్తిని లేదా టి-సెల్ రోగనిరోధక శక్తిని కూడా ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల టీకాలు ఒక వ్యక్తిలో బహు యంత్రాంగాల ద్వారా రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి.. అందువల్ల ప్రస్తుతం అందుబాటులోకి వచ్చే టీకాలు ఈ వేరియంట్‌పై ఇప్పటికీ ప్రభావవంతంగా పనిచేస్తాయి’ అని అన్నారు.


By December 31, 2020 at 07:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uk-covid-19-strain-could-have-entered-india-prior-to-december-says-aiims-director/articleshow/80038096.cms

No comments