Breaking News

‘జార్జిరెడ్డి’ హీరోతో ‘గంధర్వ’.. ఇలాంటి కథ ఈ మధ్యకాలంలో రాలేదట!


‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ మాధవ్ (శాండీ). ఇప్పుడు శాండీ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘గంధర్వ’ అనే టైటిల్‌ను పెట్టారు. గాయత్రి ఆర్. సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అప్సర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యస్ అండ్ యమ్ క్రియేషన్స్, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై యం.యన్.మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్, క్రిష్, హీరో శ్రీకాంత్, నటుడు సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో సందీప్ మాధవ్, హీరోయిన్ అక్షత శ్రీనివాస్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్‌నివ్వగా శ్రీకాంత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సందీప్ మాధవ్, హీరోయిన్ అక్షత శ్రీనివాస్, దర్శకుడు అప్సర్, ప్రముఖ నటులు సురేష్, బాబుమోహన్, ఆదర్శ్, కెమెరామెన్ జవహర్ రెడ్డి, సంగీత దర్శకుడు రాప్ రాక్ షకీల్, నిర్మాతలు వీరశంకర్, యం యన్.మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత వీరశంకర్ మాట్లాడుతూ.. ‘‘మంచి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్ అప్సర్. ఎంతో కష్టపడి ‘గంధర్వ’ అనే అద్భుతమైన కథని సిద్ధం చేశాడు. కొత్తగా మంచి సినిమా తియ్యాలన్న కసి, అభిరుచి ఉన్న దర్శకుడు ఆయన. నాకు చాలామంది ఎన్నో కథలు చెప్తూ ఉంటారు. అన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. కానీ, అప్సర్ చెప్పిన కథ విని ముగ్ధుడిని అయిపోయాను. వెంటనే ఓకే చెప్పేశాను. ఈ మధ్యకాలంలో ఇలాంటి కథ వినలేదు. కచ్చితంగా హిట్ అవుతుందనే ఆత్మవిశ్వాసంతో ఈ ప్రాజెక్ట్‌లో నేను జాయిన్ అయ్యాను. రెండు నెలలు కథపై చర్చలు జరిపి కథనం రాశాం. ఈ కథకు సందీప్ హీరో అయితే బాగుంటుందని ఎంపిక చేశాం. సాయికుమార్, సురేష్, బాబూమోహన్, గాయత్రి సురేష్ అందరూ ఈ కథ, పాత్రలు నచ్చి సినిమా చేస్తున్నారు. జవహర్ రెడ్డి కెమెరా, రాప్ రాక్ షకీల్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్స్ కానున్నాయి. ఈ సినిమా తర్వాత భవిష్యత్తులో శాండీ నుండి మరిన్ని గుర్తుండిపోయే చిత్రాలు వస్తాయి. నటుడు, నిర్మాత అయిన మధు గారితో కలిసి ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. నిర్మాత యం.యన్. మధు మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్లో ఇది రెండో సినిమా. అప్సర్ ‘గంధర్వ’ కథ చెప్పగానే వెంటనే నచ్చింది. ఈ కథకి పర్ఫెక్ట్ యాప్ట్ హీరో శాండీ. ఇందులో ఒక ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నాను. 28 నుండి నిర్విరామంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. మేలో ‘గంధర్వ’ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. ‘‘జార్జిరెడ్డి సినిమా తర్వాత చాలా కథలు విన్నాను. అన్నీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో ఉన్నాయి. కొత్తగా ఏదైనా చెయ్యాలని వేచి చూస్తున్న నాకు అప్సర్ కథ చెప్పగానే వెంటనే ఒకే చెప్పాను. తెలుగు సినిమా ఫార్మాట్లో ఓ కొత్త యాంగిల్‌ని పరిచయం చేస్తున్నారు. సాయికుమార్, సురేష్, బాబూమోహన్ లాంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని వెల్లడించారు. చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ.. ‘‘ఏదైనా ఒక సినిమా చేయాలన్న కసితో వీరశంకర్ గారికి చాలా కథలు చెప్పాను. ఆయన ఇంకా బాగుండాలి, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి నీకు అని చెప్పారు. 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన పెంచుకొని చాలా రోజులు వెయిట్ చేశాను. కొత్త కాన్సెప్ట్‌తో మంచి కథ రెడీ చేసి వీరశంకర్ గారికి చెప్పాను. ఆయన వెంటనే ఫెంటాస్టిక్‌గా ఉంది అని ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. నేను మిలటరీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చాను. అలా అని ఇది అలాంటి సబ్జెక్ట్ కాదు. శాండీ చేస్తున్నది మిలటరీ క్యారెక్టర్ అయినా ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ‘గంధర్వ’ అంటే నిత్య యవ్వనంలా ఉండటం అని అర్థం. హిలేరియస్ ఇంటెన్సిటీ ఉంటుంది. సాయికుమార్, సురేష్, బాబూమోహన్, ఆదర్శ్.. వీరితో పాటు ఇంకా 30 మంది నటిస్తున్నారు. ప్రతి క్యారెక్టర్‌కి ప్రాధాన్యత ఉంటుంది. మే 21న ఈ సినిమాని రిలీజ్ చేయాలని మా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు’’ అని అన్నారు.


By December 27, 2020 at 05:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sandeep-madhav-new-movie-gandharwa-launched/articleshow/79978039.cms

No comments