Breaking News

సాధారణ దుస్తుల్లో భారత్ భూభాగంలోకి చైనా సైనికులు.. లడఖ్‌లో కలకలం


తూర్పు సరిహద్దుల్లో చైనా ఆగడాలు కొనసాగుతున్నాయి. భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకొచ్చిన మరో ఘటన లడఖ్‌లో కలకలం రేగుతోంది. చైనా సైన్యానికి చెందిన రెండు వాహనాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను స్థానికులు విడుదల చేశారు. సంబంధిత వీడియోనూ ఎప్పుడు చిత్రీకరించారో స్పష్టంగా తెలియకపోయినా కొద్దిరోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకుందని లడఖ్ అభివృద్ధి మండలి ప్రతినిధి ఇషే స్పాల్‌జంగ్‌ తెలిపారు. పశువులను మేపడానికి చాంగ్‌తాంగ్‌ ప్రాంతానికి వెళ్తున్న స్థానిక సంచార జాతులను చైనా సైన్యాలు అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తం 5.26 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాంగ్‌తాంగ్‌లోకి సాధారణ దుస్తులతో వాహనాల్లో వచ్చిన చైనా సైనికులను స్థానికులు అడ్డుకుని, వాగ్వాదానికి దిగిన తర్వాత వారు వెనుదిరుగుతున్నట్లు వీడియోలో స్పష్టమవుతోంది. ఐటీబీపీ సిబ్బంది కూడా చైనా సైనికులను అడ్డుకుని వెనక్కు పంపారు. దీనిపై భారత సైన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై ఐటీబీపీ అధికారులను స్పందించడానికి నిరాకరించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ప్రయత్నించగా.. లేహ్ అధికారుల ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అయితే, చైనా సైన్యం భారత భూభాగంలోకి చొరబడిన విషయం స్పష్టమవుతోంది. రుష్పో లోయలోని సముద్ర మట్టానికి 14,600 మీటర్ల అడుగుల ఎత్తులో ఉన్న లేహ్‌లోని చాంగ్‌తాంగ్‌లో టిబెట్ శరణార్ధులు ఎక్కువగా ఆశ్రయం పొందుతున్నారు. తూర్పు లడఖ్‌లో ఎనిమిది నెలలుగా భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. వాస్తవాధీన రేఖ వెంబడి పాంగాంగ్ సరస్సు, చూషుల్, గోగ్రా హాట్‌స్ప్రింగ్ వద్ద ఇరు దేశాలూ తమ సైన్యాలను భారీగా మోహరించాయి. బలగాల వెనక్కు మళ్లింపుపై ఎనిమిదిసార్లు భారత్-చైనా సైనికాధికారుల మధ్య చర్చలు జరిగినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు.


By December 21, 2020 at 08:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/itbp-personnel-civilians-push-back-chinese-soldiers-in-ladakh/articleshow/79831972.cms

No comments