Breaking News

దేశంలోకి ప్రవేశించిన కొత్త కరోనా.. ఆరుగురికి యూకే స్ట్రెయిన్ నిర్ధారణ


దేశంలోకి కొత్తరకం కరోనా మహమ్మారి ప్రవేశించింది. యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో ఈ వైరస్‌ను గుర్తించినట్టు కేంద్రం మంగళవారం ప్రకటించింది. బెంగళూరులో ముగ్గురు, హైదరాబాద్‌లో ఇద్దరు, పుణేలో ఒకరికి కొత్తరకం నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. బెంగళూరులోని నిమ్‌హన్స్‌లో మూడు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారంగా వెల్లడించింది. ప్రస్తుతం వీరికి ఆయా రాష్ట్రాల్లోని కోవిడ్ కేర్ సెంటర్‌లలో చికిత్స కొనసాగుతోందని తెలిపింది. వారితో ప్రయాణించిన వ్యక్తులు, కుటుంబసభ్యులు, కాంటాక్ట్ అయిన వారిని గుర్తించినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఇద్దరికి నిర్ధారణ కాగా.. వీరిలో ఒకరు వరంగల్‌కు చెందిన వ్యక్తి ఉన్నారు. ఈయన డిసెంబరు 10న లండన్ నుంచి వరంగల్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. యూకే నుంచి వచ్చిన ఆ వ్యక్తిలో డిసెంబరు 16న కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో స్థానికంగానే నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో అతడికి పాజిటివ్‌గా తేలింది.. అప్పటి నుంచి వరంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి నమూనాలను రెండు రోజుల కిందట సేకరించి సీసీఎంబీకి పంపగా.. కరోనా జీనోమ్ సీక్వెన్స్ విశ్లేషణ పరీక్షల్లో వైరస్‌‌లో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నట్లుగా గుర్తించారు. యూకేలో విజృంభిస్తోన్న వైరస్.. ఇదీ ఒక్కటేనని నిర్ధారించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం పంపారు. కొత్తకరోనా తాజా నిబంధనల ప్రకారం.. యూకే వైరస్‌ పాజిటివ్‌గా తేలిన వారిలో చికిత్స అనంతరం పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్‌ వస్తేనే.. పూర్తిస్థాయిలో దాని ముప్పు తొలగిపోయినట్లుగా నిర్ధారిస్తారు. ప్రస్తుతానికి వరంగల్‌ కేసుకు సంబంధించి యూకే వైరస్‌ ఉన్నట్లుగా గుర్తించడంతో.. ఈ విధానం ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. అతడి తల్లికి సాధారణ కొవిడ్‌ నిబంధనలే వర్తిస్తాయి.


By December 29, 2020 at 10:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-first-six-cases-of-mutant-covid-strain-says-govt/articleshow/80004052.cms

No comments