Breaking News

పీఓకేలో ఐరాస వాహనాలపై కాల్పులు.. పాక్ ఆరోపణలకు భారత్ దిమ్మదిరిగే కౌంటర్


పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో శుక్రవారం ఐక్యరాజ్యసమితి పరిశీలకులు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. పాక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. ‘ఐరాస వాహనాలపై దాడికి సంబంధించి పాకిస్థాన్‌ వైపు నుంచి వెలువడుతున్న నివేదికలు పూర్తిగా అసంబద్ధం.. వాస్తవంగా తప్పుడు ఆరోపణలు.. భారత్‌వైపు నుంచి శుక్రవారం ఎటువంటి కాల్పులు జరగలేదు.. ఐరాస పరిశీలకులు పర్యటిస్తున్న విషయం గురించి ముందుగానే సమాచారం ఉందని, అటువంటి కాల్పులు ఉత్పన్నమయ్యే ప్రశ్నేలేదు.. ఆ ఆరోపణలు నిరాధారమైనవి’ అని విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల్లో గాయపడిన బాధితులను కలవడానికి వెళ్తున్న ఐరాస పరిశీలకుల వాహనాలపై భారత సైనికులు కాల్పులకు పాల్పడ్డారని పాకిస్థాన్ ఆరోపించింది. జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలోని రెండు సెక్టార్ల వద్ద శుక్రవారం పాకిస్థాన్ సైన్యం మరోసారి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడగా.. భారత్ సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో తన తప్పును కప్పిపుచ్చుకోడానికి పాకిస్థాన్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ‘శుక్రవారం సాయంత్రం 5.40 గంటల ప్రాంతంలో చిన్న ఆయుధాలు, మోర్టార్లతో పూంచ్ జిల్లా మెంధర్, బాలాకోట్ సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం కాల్పులు ఉల్లంఘనకు పాల్పడింది’ అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. గత కొద్ది వారాలుగా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం భారీస్థాయిలో కాల్పులకు పాల్పడుతోంది. పాక్ కాల్పుల్లో పౌరులు పెద్ద సంఖ్యలో గాయపడుతున్నారు. పాక్ చర్యలతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డిసెంబరు 1న రాజౌరి సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ ఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. నవంబరు 27న సుందర్‌బనీ సెక్టార్‌లో ఇద్దరు భారత సైనికులు, నవంబరు 26న కైరాన్‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ అమరులయ్యారు. గత ఎనిమిది నెలల్లో పాక్ 3వేలసార్లకుపైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.


By December 19, 2020 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-denies-pakistan-claim-that-it-shot-at-un-observers-vehicle-in-pok/articleshow/79808919.cms

No comments