Breaking News

టీఎంసీకి మరో ఎమ్మెల్యే రాజీనామా.. రెండు రోజుల్లో ముగ్గురు.. దీదీకి వరుస షాక్‌లు


పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి సువేందు అధికారి, ఎమ్మెల్యే జితేంద్ర తివారీ ఇప్పటికే రాజీనామా చేయగా.. తాజాగా బరాక్‌పోర్‌ ఎమ్మెల్యే సిల్‌భద్ర దత్తా టీఎంసీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం మమతాబెనర్జీకి ఈమెయిల్‌ ద్వారా రాజీనామా లేఖ పంపారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నేను పార్టీలో కొనసాగడం సరికాదు. కానీ, ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకోను.. ఎందుకంటే నేను ప్రజల ఓట్లతో గెలిచాను’ అని దత్తా రాజీనామ లేఖలో పేర్కొన్నారు. తృణమూల్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ నిర్ణయాలను దత్తా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై పార్టీ నేతలు ఆయనతో సంప్రదింపులకు ప్రయత్నించినా ఫలించలేదు. సువేందు అధికారి రాజీనామా చేసిన కొద్ది గంటలకే ఎమ్మెల్యే జితేంద్ర తివారీ టీఎంసీను వీడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ సహా ఇతర పదవులకు రాజీనామా చేశారు. ఇక, రెండు దశాబ్దాలుగా అధినేత్రి వెంట ఉన్న సువేందు.. టీఎంసీలో అగ్రనేతగా ఎదిగారు. కమ్యూనిస్టుల కంచుకోటను బద్ధలుకొట్టి 2011 ఎన్నికల్లో టీఎంసీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన నందిగ్రామ్‌ ఉద్యమంలో సువేందు కీలక పాత్ర పోషించారు. దీదీ అధికారం హస్తగతం చేసుకోవడంలో తనవంతు సహకారం అందించారు. అయితే, గత కొద్దికాలంగా అధిష్ఠానం వైఖరిపై అసంతృప్తిగా ఉన్న సువేందు.. తొలుత మంత్రి పదవికి, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గురువారం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి వైదొలిగారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల పాటు కేంద్ర హోం మంత్రి అమితా షా బెంగాల్‌‌లో పర్యటించనున్నారు. శనివారం షా సమక్షంలోనే సువేందు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు పలు రెబల్‌ నేతలు కూడా కాషాయ కండువ కప్పుకోనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జరుగుతున్న వరుస పరిణామాలతో బెంగాల్‌ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. గతవారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై దాడితో టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బెంగాల్‌లో అధికారం సాధించాలని బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించి, అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. అయితే, తృణమూల్‌ మాత్రం విజయంపై ధీమాగానే ఉంది. ఒకరిద్దరి రాజీనామాలతో పార్టీ బలహీపడదని, వాళ్లు వెళ్లిపోయినంత మాత్రాన తమకు వచ్చే నష్టం ఏమీలేదని కార్యకర్తల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తోంది.


By December 18, 2020 at 01:12PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/trinamool-mla-quits-third-exit-in-2-days-in-worry-for-west-bengal-cm-mamata-banerjee/articleshow/79793654.cms

No comments