Breaking News

వచ్చే ఏడాది జనవరి 7 వరకు బ్రిటన్ విమానాలపై నిషేధం


బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్ విజృంభణతో ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై భారత్ తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. తొలుత డిసెంబరు 31 వరకు నిషేధం విధించారు. తాజాగా, దానిని జనవరి 7 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల బ్రిటన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చినవారిలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నిషేధాన్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత్ నిర్ణయించింది. కేంద్ర విమానయాన మంత్రి హర్‌దీప్ సింగ్ పురి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య విమాన సేవలు, కొత్త వైరస్‌ కట్టడి వంటి అంశాలపై ఒకట్రెండు రోజుల్లో చర్చిస్తామని అన్నారు. ‘వందే భారత్‌ మిషన్‌’ ద్వారా ఇప్పటి వరకు 42 లక్షల మంది భారతీయులను విదేశాల నుంచి తీసుకొచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు. వీరిలో అత్యధికంగా కేరళకు 8 లక్షల మంది, తెలంగాణకు మొత్తం 1,84,632 మంది వచ్చినట్లు వెల్లడించారు. కొవిడ్‌కు ముందు 40 దేశాలకు రాకపోకలు సాగించిన ఎయిర్‌ ఇండియా... కరోనా సమయంలో 75 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిందన్నారు. బ్రిటన్‌‌లో కొత్తరకం వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమయ్యింది. ఈ స్ట్రెయిన్‌ను పసిగట్టి, వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. డిసెంబరు 9 నుంచి 22 మధ్య భారత్‌కు వచ్చి, పాజిటివ్‌గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్‌ జన్యు క్రమాన్ని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 20 మందిలో కొత్తరకం కరోనాను గుర్తించారు. మిగతావారికి ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించి, కొద్దిరోజుల పాటు వారిని పర్యవేక్షిస్తారు.


By December 30, 2020 at 12:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-uk-flights-suspended-till-january-7-due-to-new-covid-strain/articleshow/80023308.cms

No comments