Breaking News

చిత్రసీమలో విషాదం నింపిన 2020.. ఈ లోకాన్ని వీడిన సినీ ప్రముఖులు వీళ్లే


అందరికీ వినోదాన్ని పంచే చిత్ర పరిశ్రమకు సంవత్సరం విషాదాన్ని మిగిల్చింది. ఎన్నో కోట్ల మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి కళామతల్లి ముద్దుబిడ్డల ప్రాణాలను సైతం బలి తీసుకుంది. మరికొందరు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్లు మూతపడటంతో ఇండస్ట్రీలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఇలా సెలబ్రెటీల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు ఈ ఏడాది ఎంతో ఆవేదనను మిగిల్చింది. మరికొద్ది రోజుల్లో కొత్త వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో 2020లో ఈ లోకాన్ని వీడిన సినీ ప్రముఖులను ఓసారి స్మరించుకుందాం. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన స్వర్గస్తులు కావడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కరోనా సోకడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన సుమారు రెండు నెలల చికిత్స పొందారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల పాటు 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సాధిం బాలు.. అనేక చిత్రాల్లో తన నటనతోనూ అలరించారు. తెలుగు ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసిన మరో మరణం నటుడు జయప్రకాశ్‌ రెడ్డిది. రంగస్థలం నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గుంటూరులో తన నివాసంలో ఉన్న సమయంలో సెప్టెంబర్ 8న గుండెపోటుతో మరణించారు. రాయలసీమ మాండలికంతో విలనిజం పండిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న జేపీ... ‘ప్రేమించుకుందాం రా, ‘సమరసింహారెడ్డి’, ‘జయం మనదేరా’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘టెంపర్‌’.. తనదైన నటనతో మెప్పించారు. దాదాపు ఆరు వందలకు పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ నటులు రావి కొండలరావు కూడా ఈ ఏడాదే మరణించారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన జులై 28న గుండెపోటుతో మరణించారు. 1932లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన ఆయన 1958లో వచ్చిన ‘శోభ' అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. నటుడిగానే కాకుండా రచయిత, సినీ విమర్శకుడు, ఎడిటర్, థియేటర్ ఆర్టిస్ట్‌, జర్నలిస్ట్‌.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మర్యాద రామన్న’, ‘విక్రమార్కుడు’, ‘ఛలో’, ‘పిల్ల జమిందారు’, జయమ్ము నిశ్చయమ్మురా.. వంటి సినిమాలతో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కోసూరి వేణుగోపాల్ ఈ ఏడాది సెప్టెంబర్ 23న తుదిశ్వాస విడిచారు. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ సెప్టెంబర్ 23న మరణించారు. బాలీవుడ్‌లో సుశాంత్‌ సింగ్ ‘ఎం.ఎస్.ధోనీ’ సినిమాతో అందరిచేత ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ ఏడాది జూన్ 14న తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బాలీవుడ్‌తో పాటు దేశాన్నే కుదిపేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కుంభకోణం అందరినీ షాక్‌కు గురిచేసింది శాండల్‌వుడ్‌లో చిరంజీవి సర్జా 2020లో పెను విషాదాన్ని నింపిన మరో ఘటన కన్నడ హీరో చిరంజీవి సర్జా. ‘జెంటిల్‌మెన్’ హీరో అర్జున్ మేనల్లుడైన చిరంజీవి కన్నడలో హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే ఈ ఏడాది జూన్ 7న ఆయన గుండెపోటుతో మరణించాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ఆయన భార్య మేఘనారాజ్ అక్టోబర్ 22న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.


By December 25, 2020 at 11:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/movie-celebrities-who-died-in-2020-year-list/articleshow/79951683.cms

No comments