Breaking News

కశ్మీర్: సొరంగం ద్వారా 200 మీటర్లు పాక్ భూభాగంలోకి వెళ్లిన బీఎస్ఎఫ్


ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని నగరోటా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన పాక్‌ ఉగ్రవాదులు దేశంలోకి ఎలా చొరబడ్డారనేది గుర్తించింది. ఓ సొరంగ మార్గం గుండా చొరబడినట్టు గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. కశ్మీర్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ఉపయోగించిన సొరంగ ప్రవేశ ద్వారం పాక్‌లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దానికి సంబంధించిన కీలక సమాచారం తెలుసుకోడానికి బీఎస్‌ఎఫ్‌ బృందం అందులోకి వెళ్లొచ్చినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదుల చొరబాటు పాల్పడిన సొరంగం ప్రవేశ మార్గాన్ని కనుగొనేందుకు బీఎస్‌ఎఫ్‌ బృందం బయలుదేరింది. అందులో భాగంగా సొరంగం వెంట 150-200 మీటర్ల మేర పాక్‌ భూభాగంలోకి ప్రయాణించారు. ఆ సొరంగం ప్రారంభ ద్వారం పాకిస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించారు. బీఎస్‌ఎఫ్‌ బృందం తిరిగి వచ్చేటప్పుడు సాక్ష్యాల కోసం అందులోని దృశ్యాల్ని రికార్డు చేసింది’ అని బీఎస్ఎఫ్ జమ్మూ రేంజ్ ఐజీ ఎన్ఎస్ జమావల్ తెలిపారు. ‘సొరంగం ప్రవేశ ద్వారం వద్ద పాక్ గుర్తులున్న ఇసుక బస్తాలు, రోప్‌.. అలాగే పాకిస్థాన్‌లో తయారయిన బిస్కెట్ కవర్లు గుర్తించాం.. గతంలోనూ ఇటువంటి సొరంగాలను గుర్తించాం.. కానీ అంతకు ముందు గుర్తించిన వాటిని వర్షాకాలంలో వర్షపు నీరు ముంచెత్తేది. ఇది వర్షాకాలం ముగిసిన తర్వాత ఇటీవల తవ్విందేనని భావిస్తున్నాం’ జమావల్ అన్నారు. సంబా జిల్లాలోని జాతీయ రహదారి సమీపంలో నవంబరు 22న గుర్తించిన ఈ సొరంగం గుండా ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తున్న వ్యక్తులు సులువుగా నడుచుకుని రావచ్చని అధికారులు తెలిపారు. రేగల్ పోస్ట్ వద్ద గుర్తించిన ఈ సొరంగం భారత భూభాగంలో ఇది 160 మీటర్ల వరకు ఉంది. ఇది పాక్ రేంజర్స్ చక్ భూరా పోస్ట్ నుంచి ప్రారంభమయ్యింది. చిన్న చెక్కలతో బలోపేతం చేసిన ఈ సొరంగం.. భూమి కింద 20 అడుగుల లోతున.. మూడు అడుగుల వెడల్పుతో తవ్వారు. జమ్మూ కశ్మీర్‌లో హింసను ప్రోత్సహించడానికి ఉగ్రవాదులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్‌ను డ్రోన్లు, సొరంగ మార్గాల ద్వారా పాకిస్థాన్ పంపుతోంది. నగ్రోటాలో నవంబర్‌ 19న నలుగురు పాక్‌కు జైషే ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల చొరబాటు విషయమై బీఎస్‌ఎఫ్‌, ఇంటలిజెన్స్‌, కశ్మీర్‌ పోలీసులు విచారణ చేపట్టగా.. ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి. సొరంగంలో పాకిస్థాన్‌లోని తమ నేతలతో డిజిటల్ మొబైల్ రేడియో ద్వారా ఉగ్రవాదులు సంభాషించినట్టు గుర్తించారు. ఈ రేడియోను పాక్‌ సంస్థ మైక్రో ఎలక్ట్రానిక్స్, క్యూమొబైల్ స్మార్ట్‌‌ఫోన్ తయారుచేశాయి.


By December 02, 2020 at 07:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jammu-and-kashmir-bsfteam-went-200m-inside-pak-territory-to-find-mouth-of-tunnel/articleshow/79521627.cms

No comments