Breaking News

అయ్యప్ప భక్తులకు కేరళ సర్కాారు తీపికబురు.. ఇకపై రోజుకు 2వేల మందికి అనుమతి


అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం స్వామి దర్శనం కోసం రోజుకు 1,000 మంది భక్తులనే అనుమతిస్తుండగా.. ఇకపై రోజుకు 2 వేల మందిని అనుమతిస్తామని తెలిపింది. ఈ మేరకు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 1,000 మందిని, వారాంతాలు, సెలవు రోజుల్లో 2 వేల మందిని దర్శనానికి అనుమతిస్తున్నారు. తాజా నిర్ణయంతో సాధారణ రోజుల్లో 2 వేల మందిని, శని, ఆదివారాల్లో రోజుకు 3 వేల మందిని అనుమతించనున్నారు. అయితే, దర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించిన నిబంధనల్లో ఎటువంటి మార్పులు లేవని మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞ‌ప్తి మేరకు దర్శనాల సంఖ్యను పెంచినట్టు తెలిపారు. ఆన్‌లైన్‌లోనే ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. నిలక్కళ్ చేరడానికి 24 గంటల ముందు కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్ సమర్పించిన వారినే దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు నిలక్కళ్ వద్ద కోవిడ్ పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. గత రెండు వారాలుగా సన్నిధానం, పంబ వైద్య శిబిరాల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పలు విభాగాలకు చెందిన సిబ్బందికి సోమవారం నుంచి కొవిడ్‌ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. రోజుకు సుమారు 200 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. నవంబరు 16న ఆలయం తెరిచిన నాటి నుంచి 27 వరకు చేసిన పరీక్షల్లో భక్తులు, పోలీసులు, ఆలయ సిబ్బందిలో 39 మందికి కొవిడ్‌ సోకినట్లు స్పష్టం చేశారు. డిసెంబరు 26న మండల పూజ, జనవరి 14న మకరవిళక్కు(మకర జ్యోతి దర్శనం) ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. జనవరి 20న ఆలయాన్ని మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.


By December 03, 2020 at 06:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sabarimala-ayyappa-temple-to-allow-2000-pilgrims-per-day-says-kerala-minister/articleshow/79539538.cms

No comments