Breaking News

అమెరికా ఎన్నికలు.. అధ్యక్షుడ్ని నిర్ణయించేది ఆ ఐదు రాష్ట్రాల ఫలితాలే!


అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యింది. ప్రస్తుతం వెలువడిన ఫలితాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు బైడెన్‌కు 122 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌నకు 92 ఓట్లు వచ్చాయి. అయితే, పాపులర్‌ ఓట్లలో మాత్రం తొలి నుంచి ట్రంప్‌ ఆధిక్యత కనబరుస్తున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లకు గానూ 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. వెస్ట్‌ వర్జీనియా, కెంటకీ, సౌత్‌ కరోలైనా, ఒక్లహామా, అర్కన్సాస్‌, టెన్నెసీ, ఇండియానా, మిస్సిసిపీ, అలబామాలో ట్రంప్ విజయం సాధించారు. అలాగే కీలక రాష్ట్రంగా భావిస్తున్న ఫ్లోరిడా, జార్జియాలో ట్రంప్‌ ముందంజలో ఉండగా.. నార్త్‌ డకోటా, మిచిగాన్‌, మెనీ రాష్ట్రాల్లోనూ ట్రంప్‌ ఆధిక్యం కొనసాగుతోంది. వర్జీనియా, వెర్మాంట్‌, ఇల్లినాయిస్‌, మేరీలాండ్‌, డెలావెర్‌, న్యూజెర్సీ, కొలరెడో, కనెక్టీకట్‌, మసాచుసెట్స్‌, రోడ్‌ ఐలాండ్‌ రాష్ట్రాల్లో జో బైడెన్‌ దక్కించుకున్నారు. టెక్సాస్‌, కాన్సాస్‌, మిస్సౌరీ, ఒహైయో, పెన్సిల్వేనియా, న్యూ హాంప్‌షైర్‌, నార్త్‌ కరోలైనా రాష్ట్రాల్లో బైడెన్‌ ప్రస్తుతానికి ముందంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌, జార్జియా, నార్త్‌ కరోలైనా, అరిజోనా రాష్ట్రాల ఫలితాలే నూతన అధ్యక్షుడెవరో తేల్చబోతున్నాయి. ఇప్పటికే జార్జియా, మిచిగాన్‌లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. భారతీయ అమెరికన్ ఓటర్లు 25 లక్షల మంది వరకు ఉండగా అందులో 13 లక్షల మంది వరకు టెక్సాస్‌, మిచిగన్‌, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా రాష్ట్రాలకు చెందినవారే. ఉత్కంఠగా సాగుతున్న పోరులో వారి ఓట్లు కీలకంగా మారే అవకాశముంది.


By November 04, 2020 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-election-georgia-and-pennsylvania-results-show-president-race-in-key-states/articleshow/79032943.cms

No comments