బిహార్ ఎన్నికల కంటే రాహుల్కు పిక్నికే ముఖ్యం.. ఆర్జేడీ నేత సంచలన వ్యాఖ్యలు
బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లను కేటాయించడమే మహాకూటమి కొంప ముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికల్లో యువనేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి 110 స్థానాలతోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. మహాకూటమిదే విజయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లకిందులు చేస్తూ 125 స్థానాలతో ఎన్డీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో పొత్తు విజయావకాశాలను దెబ్బదీసిందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా, ఈ అంశంలో కాంగ్రెస్పై ఆర్జీడీ సీనియర్ నేత శివానంద్ తివారీ బాహటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ కనీసం 70 ప్రచార సభలు కూడా నిర్వహించలేదు. ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ కేవలం మూడు రోజులే బిహార్లో పర్యటించారు. రోజుకు రెండు సభలు చొప్పున ఆరు చోట్ల ప్రచారం నిర్వహించారు.. ప్రియాంకా గాంధీ అయితే అసలు ఇటు తొంగిచూడలేదు.. దేశమంతా బిహార్ ఎన్నికల వైపు దృష్టి సారించిన సమయంలో.. రాహుల్ తన సోదరి ప్రియాంక ఇంట్లో పిక్నిక్ చేసుకున్నారు. బిహార్కు ఏ మాత్రం పరిచయం లేనివారు ఇక్కడ ప్రచారానికి వచ్చారు. పార్టీని నడిపే తీరు ఇదేనా? ఇది సరి కాదు’అని ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ దుయ్యబట్టారు. ‘ మూడు రోజులే బిహార్లో ఎన్నికల ప్రచారం చేసి ఆరు చోట్ల ప్రసంగించారు.. ఆయన కంటే వయసులో పెద్దవాడైన ప్రధాని నరేంద్ర మోదీ రోజుకు మూడు నుంచి నాలుగు సభలలో పాల్గొన్నారు.. రాహుల్ మాత్రం బిహార్ నుంచి వెళ్లిపోయి సిమ్లాలో తన సోదరి ప్రియాంక ఇంట్లో పిక్నిక్ చేసుకున్నారు.. రాహుల్ కేవలం రోజుకు రెండు సభల్లోనే పాల్గొంటున్నారు ఎందుకని మహాగట్బంధన్ సమన్వయ కమిటీ సమావేశంలో నేను ప్రశ్నించాను’అని అన్నారు. దేశమంతా బిహార్ ఎన్నికలపై ఆసక్తిగా ఉంటే ప్రియాంక గాంధీ ఎందుకు ప్రచారానికి రాలేదని ప్రశ్నించారు. అధిక స్థానాల్లో పోటీకి ఉత్సాహం చూపే కాంగ్రెస్.. ఆ సీట్లను గెలుచుకునేందుకు కృషి చేయదని ఆరోపించారు. కేవలం బిహార్లోనే కాదు ఇత రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ఇదే వైఖరి ప్రదర్శిస్తోందని శివానంద్ విమర్శించారు. దీనిని గురించి ఆ పార్టీ పునరాలోచన చేయాలని ఆయన హితవు పలికారు.
By November 16, 2020 at 12:57PM
No comments