Breaking News

బిహార్: ఇద్దరు డిప్యూటీ సీఎంలు, స్పీకర్ సహా కీలక శాఖలు బీజేపీకి?


బిహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయనను శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. బీజేపీ కంటే జేడీ (యూ)కి తక్కువ సీట్లొచ్చినా ఇచ్చిన మాట ప్రకారం నితీశ్‌కు సీఎం పగ్గాలను అప్పగిస్తున్నారు. అయితే, డిప్యూటీ సీఎం, కీలక శాఖలు సహా స్పీకర్ పదవులను బీజేపీ చేజిక్కించుకోనుంది. ఈసారి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సుశీల్ మోదీకి కేంద్ర వర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు, నితీశ్ కుమార్ ఆదివారం రాత్రి సమావేశమై నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎంలుగా బీజేపీ ఎమ్మెల్యేలు తార్‌కిశోర్ ప్రసాద్, రేణూ దేవిల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. బీజేపీ శాసనసభ పక్షనేతగా కిశోర్ ప్రసాద్‌ను నియమించనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ముఖ్యమంత్రిగా 2005లో నితీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నుంచి ఇప్పటి వరకు ఏడాది తప్ప మిగతా కాలం సుశీల్ మోదీ బిహార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండటంతో మరోసారి సుశీల్‌కు డిప్యూటీ సీఎం పగ్గాలు దక్కుతాయని భావించారు. కానీ, ప్రస్తుతం జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీ, సంఘ్ పరివార్ అనేక బాధ్యతలు అప్పగించాయి.. వాటిని సమర్ధవంతంగా నిర్వహించాను.. తనను పార్టీ కార్యకర్త పదవి నుంచి ఎవ్వరూ దూరం పెట్టలేరు’ అంటూ సుశీల్ మోదీ ట్వీట్ చేశారు. తమ కంటే 31 సీట్లు తక్కువున్న జేడీయూకి సీఎం పదవి దక్కుతుంది కాబట్టి.. వాస్తవంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలు, స్పీకర్, కీలక శాఖలు తమకే రావాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 125 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, బీజేపీకి 74 స్థానాలతో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.


By November 16, 2020 at 10:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-elections-2-deputy-chief-minister-posts-key-ministries-and-speaker-for-bjp/articleshow/79241767.cms

No comments