Breaking News

కోవిడ్ లక్షణాలున్నవారితోనే నాలుగు రెట్లు అధికంగా వైరస్ వ్యాప్తి.. తాజా అధ్యయనంలో వెల్లడి


లక్షణాలున్న వ్యక్తుల నుంచే నాలుగు రెట్లు అధికంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అలాగే కరోనా బాధితులతో నివసించే వారు ముఖ్యంగా కుటుంబసభ్యులకు వైరస్‌ సోకే ముప్పు ఎక్కువని లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ అధ్యయనంలో గుర్తించారు. దీంతో కరోనా వైరస్‌ నిర్ధారణ కాగానే ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచడం చాలా ముఖ్యమని.. తద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉందని సూచించింది. వివిధ ప్రదేశాల్లో వైరస్‌ వ్యాప్తి తీరుపై ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాలు, సామాజిక కార్యక్రమాల్లో కంటే ఇళ్లలోనే వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందని అధ్యయనం పేర్కొంది. కరోనా బాధితుడితో వరుసగా ఐదు రోజులు ఇల్లు పంచుకునే కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన 45‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌’అధ్యయనాలపై స్టాటిస్టికల్‌ రివ్యూ నిర్వహించిన ఈ ఫలితాలను వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో లక్షణాలు బయటపడనివారే సవాల్‌గా మారారని అధ్యయన నివేదిక వ్యాఖ్యానించింది. లక్షణాలు లేకపోవడం వల్లే ‘కాంటాక్ట్‌ ట్రేసింగ్‌’లో అసలు వైరస్‌ను ఎవరు వ్యాప్తి చేస్తున్నారో గుర్తించలేకపోతున్నామని పేర్కొంది. వ్యాప్తికి, వయసుకి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. వివిధ ప్రదేశాల్లో వైరస్‌ వ్యాప్తి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోడానికి ఇది ఉపయోగపడుతుందని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్‌ హేలే థామ్సన్‌ అభిప్రాయపడ్డారు. దీని వల్ల మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించొచ్చని తెలిపారు. లక్షణాల్లేని కేసులు కంటే లక్షణాలు బయటపడ్డ వ్యక్తుల ద్వారానే వైరస్ వ్యాప్తి ఎక్కువని తొలిసారిగా శాస్త్రీయ ఆధారం లభించింది. ఇది ఇంటిలో వైరస్ వ్యాప్తి ప్రాముఖ్యతను మరింత బలోపేతం చేస్తుంది.. ప్రత్యేకించి రోగలక్షణాలున్న కేసులను వేరుచేయలేమని ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ చెప్పారు. ఫెర్గూసన్ మోడల్.. బ్రిటన్‌లో వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి లాక్‌డౌన్ ప్రకటించటానికి దోహదం చేసింది. ప్రపంచవ్యాప్తంగా జులై వరకు ప్రచురించిన 45 కాంటాక్ట్-ట్రేసింగ్ అధ్యయనాలను విశ్లేషించారు. ‘లక్షణాలు బయటపడని కేసులు సెకెండరీ కాంటాక్ట్ రేటు ఇండెక్స్ కేసుల (12.8 శాతం, 95 శాతం సీఐ: 8.9 శాతం) కంటే మూడింట రెండు వంతుల (3.5 శాతం, 95 శాతం సీఐ: 0.0% -6.4%) గా అంచనా వేశాం. -16.7 శాతం, p= <0.001)’ ఇంపీరియల్ కాలేజీ ఎంఆర్సీ సెంటర్ ఫర్ గ్లోబల్ ఇన్ఫక్టియస్ డిసీజ్ అనాలిసిస్ తెలిపింది.


By November 29, 2020 at 11:51AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/symptomatic-covid-19-patient-is-4-times-more-likely-to-pass-on-virus-reveals-imperial-study/articleshow/79472716.cms

No comments