Breaking News

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రాంతీయ భాషల్లోనే ఇంజినీరింగ్.. వచ్చే ఏడాది నుంచే!


మాతృభాషలోనే విద్యా బోధనకు మరింత ప్రోత్సాహం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సాంకేతిక విద్యను ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సులను ప్రాంతీయ భాషలలో బోధించనున్నారు. ఇందుకు కొన్ని ఐఐటీలు, ఎన్‌ఐటిలను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన గురువారం జరిగిన అత్యున్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యా బోర్డులలో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసిన తరువాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) పోటీ పరీక్షల కోసం సిలబస్‌ను రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. సమావేశం అనంతరం వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్‘వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాతృభాషలో విద్యను అందించే ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభించాలని సమావేశంలో ప్రాథమిక నిర్ణయం తీసుకున్నాం... ఇందుకు కొన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలను ఎంపిక చేయనున్నాం’ అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జేఈఈ-మెయిన్‌ పరీక్షను హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తొమ్మిది ప్రాంతీయ భాషలలోనూ నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ అక్టోబరులో నిర్ణయించిన విషయం తెలిసిందే. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ను ప్రాంతీయ భాషలలో నిర్వహించే అంశంపై ఐఐటీలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే, కేంద్ర విద్యా శాఖ ఇప్పటికే ఈ అంశంపై ఐఐటీలను సంప్రదించినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రాంతీయ భాషలలో ఇంజినీరింగ్ కోర్సులను భోధిస్తే అధ్యాపకులు, స్టడీ మెటీరియల్ విషయంలో సవాల్ ఎదురవుతాయని పలు ఐఐటీ, ఎన్‌ఐటీల ప్రొఫెసర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఓ ఐఐటీ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఇంత తక్కువ వ్యవధిలో ఈ నిర్ణయం అమలు చేయడం అసాధ్యమని అన్నారు. ‘ఐఐటీలలో అన్ని భాషలను బోధనా మాధ్యమంగా ప్రారంభించిన తరువాత, అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు చేరుతారు.. ఆ విద్యార్ధి ఒడియా లేదా తెలుగు భాషలో చదువుకోవాలనుకుంటే ఒక్క విద్యార్థిని కూడా తిరస్కరించడం న్యాయం కాదు. ఇంత విస్తృతమైన విషయాలను బోధించడానికి మనకు అధ్యాపకులు ఎక్కడ దొరుకుతారు? నిజానికి ఇప్పుడు ఇంగ్లీషులో కూడా బోధించే అధ్యాపకుల కోసం శ్రమించాల్సి వస్తుంది.. రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాలలు క్రమంగా స్థానిక భాషలో కోర్సులను అందిస్తాయి’ అని పేర్కొన్నారు. లాజిస్టిక్ సమస్యలను ప్రధాన ఆటంకంగా పేర్కొన్నాయి. ‘మాతృభాషలో బోధించడానికి అధ్యాపకుల లభించడం ప్రధాన సమస్య అవుతుంది.. తరగతులను భాషల వారీగా విభజించాలి.. ఈ భాషలలో పుస్తకాల లభ్యత మరొక సమస్య అవుతుంది’ అని ప్రముఖ ఎన్‌ఐటీ డైరెక్టర్‌ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాదాపు అన్ని విద్యా సంస్థలు సిలబస్‌ను కుదించాయి. జేఈఈ, యూజీసీ సహా ఇతర పరీక్షలు నిర్వహించే ఎన్‌టీఏ.. పోటీ పరీక్షల సిలబస్‌ రూపొందిస్తుందని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో పాఠశాల బోర్డులను ఎన్‌టీఏ సంప్రదించి, పరిస్థితిని సమీక్షించి అవగాహనకు వస్తుంది.. ఏదిఏమైనప్పటికీ ఇది జేఈఈ మెయిన్ సిలబస్‌పై ప్రభావం చూపే అవకాశం లేదు అని ఓ ఉన్నతాధికారి తెలిపారు.


By November 27, 2020 at 01:01PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/iits-nits-to-offer-engineering-courses-in-regional-languages-from-next-academic-year/articleshow/79442696.cms

No comments