Breaking News

ప్రపంచానికి మరో గుడ్ న్యూస్.. మోడెర్నా టీకా దాదాపు 95 శాతం ప్రభావవంతం


మహమ్మారికి టీకా గురించి ఆశగా ఎదురుచూస్తున్న ప్రపంచానికి మరో శుభవార్త తెలిసింది. ఇటీవలే అమెరికా ఫార్మ ఫైజర్-జర్మన్ సంస్థ బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా 90 శాతం 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాకు చెందిన మరో సంస్థ మోడెర్నా అదే తరహా సానుకూల ప్రకటన చేసింది. కరోనా వైర్‌సపై తమ వ్యాక్సిన్‌ (ఎంఆర్‌ఎన్‌ఏ-1273)94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని సోమవారం ప్రకటించింది. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) నియమించిన డేటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు (డీఎస్ఎంబీ) నిపుణుల బృందం ఇప్పటివరకు మోడెర్నా నిర్వహించిన మూడోదశ క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని విశ్లేషించి ఈవిషయాన్ని వెల్లడించాయి. మొత్తం 30వేల మంది వాలంటీర్లపై మోడెర్నా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వీరిలో 15వేల మందికి ప్లాసీబో (డమ్మీ) చికిత్స.. మరో 15వేల మందికి వ్యాక్సిన్‌ ( ఎంఆర్‌ఎన్‌ఏ-1273) అందజేశారు. ప్లాసీబో ఇచ్చిన 90 మందిలో కరోనా లక్షణాలు బయటపడగా, వారిలో 11 మందిలో తీవ్ర ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు. వ్యాక్సిన్‌ గ్రూపులోని వాలంటీర్లలో ఐదుగురిలోనే కరోనా లక్షణాలు బయటపడినా వైరస్ తీవ్రత జాడ కనిపించలేదు. వ్యాక్సిన్ తయారీలో ఫైజర్, మోడెర్నా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడ్డాయి.. ‘మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ’ అని పిలిచే అణువుల సింథటిక్ వెర్షన్‌లను మానవ కణాలలో హ్యాక్ చేయడానికి ఉపయోగించి, వాటిని టీకా తయారీకి ఫ్యాక్టరీగా మారుస్తారు. ‘మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై వచ్చిన ఈ సానుకూల మధ్యంతర విశ్లేషణ.. మా టీకా కోవిడ్-19 తీవ్రంగా ఉన్నా నివారించగలదని మొదటి క్లినికల్ ట్రయల్స్‌‌కు ధ్రువీకరణ ఇచ్చింది’అని మోడెర్నా సీఈఓ స్టెఫానే బాన్సెల్ అన్నారు. మోడెర్నా ప్రకటనపై కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ రోజు మరో వ్యాక్సిన్ నుంచి వచ్చిన వార్త భవిష్యత్తుపై ఆశలు కల్పించిందని అన్నారు. అప్పటి వరకు వైరస్ అదుపులోకి తీసుకురావడానికి భౌతిక దూరం, మాస్క్ ధరించడం కొనసాగించాలని సూచించారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ట్వీట్ చేశారు. ‘మరో వ్యాక్సిన్ ఇప్పుడు ప్రకటించారు.. మోడెర్నా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుంది.. కొంత మంది గొప్ప చరిత్రకారులు చైనా ప్లేగును అంతం చేసే ఈ గొప్ప ఆవిష్కరణలు అన్నీ నా హయాంలోనే జరిగాయని గుర్తుంచుకోండి!’ అని వ్యాఖ్యానించారు. ఇక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ అనుబంధ సంస్థ జాన్సెన్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌తో మూడోదశ ట్రయ ల్స్‌ తొలుతగా బ్రిటన్‌లో ప్రారంభమయ్యాయి. 6వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు.


By November 17, 2020 at 07:20AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-pharma-moderna-says-its-coronavirus-vaccine-is-over-94-effective/articleshow/79254289.cms

No comments